కాగితం విలాస వస్తువేమీ కాదు
తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆందోళన
నవతెలంగాణ- హైదరాబాద్ :
కేంద్ర ప్రభుత్వం కాగితంపై 18 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వేసిందని.. ఇది అనుచితమని తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అభిషేక్ విజయవార్జీ అన్నారు. పేపర్ విలాస వస్తువు కాదని.. ఇది అత్యవసర వస్తువని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రచురణకర్తలు, ప్రింటర్లు, ప్యాకేజింగ్ పరిశ్రమ సహా సమాజంలో ఎంతో మంది ప్రతిరోజూ ఉపయోగించే ఒక అత్యవసర వస్తువు కాగితం అన్నారు. దీనిపై ఇటీవల జీఎస్టీని 18 శాతానికి పెంచడం వల్ల విద్య, సంబంధిత పరిశ్రమలపై అధిక భారం పడుతుందన్నారు. కాగితం కేజీ రూ.70, జిఎస్టి ఐదు శాతం కలిపితే రూ.73.50 అవుతుందన్నారు. అదే 18 శాతం జీఎస్టీ అయితే రూ.82.60 అవుతుందన్నారు. కిలోపై అదనంగా 12 శాతం భారం పడనుందన్నారు. నూతన జీఎస్టీతో నోటుబుక్స్, పాఠ్య పుస్తకాలు, పరీక్ష పత్రాలు, ప్యాకేజింగ్, రోజువారీ ఉత్పత్తులపై అనేక రెట్లు పెరుగుతుందని చెప్పారు. దేశంలో కాగితం పరిశ్రమ అడవులను నరకడం లేదన్నారు. సొంతంగా చెట్లను సాగు చేస్తుందన్నారు. కాగితంపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు.
పేపర్పై 18 శాతం జీఎస్టీ అనుచితం
- Advertisement -
- Advertisement -