నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో జరిగిన పలు ఆపరేషన్లలో 17 మంది టిటిపి (తెహ్రిక్ – ఇ తాలిబన్ పాకిస్తాన్) గ్రూప్కు చెందిన 17 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు శనివారం పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బన్ను జిల్లాలోని షెరీఖేల్, పక్కా పమార్ ఖేల్ ప్రాంతాలలో పోలీసులు, భద్రతా దళాలు సమన్వయంగా ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్లు నిర్వహించాయి. లక్కీ పోలీస్లు, బన్ను ఉగ్రవాద నిరోధక విభాగం (సిటిడి), భద్రతా దళాల నేతృత్వంలో జరిగిన ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు జరిపిన ఎదురుకాల్పుల్లో పదిమంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఐదురుగురు గాయపడ్డారు.
అయితే ఉగ్రవాదులకు సహాయపడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఖైబర్ ఫఖ్తుంక్వా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జుల్పికర్ హమీద్ తెలిపారు. ఏడుగురు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మరో ముగ్గురు మృతదేహాలను పొందలేకపోయినట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఎనిమిది గంటలు జరిపిన ప్రత్యేక ఆపరేషన్లో మరో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఉగ్రవాదుల నుండి భారీస్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు హమీద్ తెలిపారు.



