నవతెలంగాణ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 382 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో పర్యావరణ శాఖ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో 50శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని, మిగిలిన సగం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని ఆదేశించింది.
పర్యావరణ పరిరక్షణ చట్టం-1986లోని సెక్షన్ 5 నిబంధన ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. నగరంలో వాహనాల రాకపోకలను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 50శాతం మందికి ‘వర్క్ ఫ్రం హోం’ నిబంధనను అన్ని సంస్థలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అత్యవసర విభాగాలైన ఆస్పత్రులు, ప్రజారవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అగ్నిమాపక కేంద్రాలకు మినహాయింపునిచ్చారు.



