ప్రారంభమైన యాసంగి సీజన్
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ – మల్హర్ రావు
యాసంగి సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటికే రైతులు నారుమళ్లు (తూకం) పోసి పంటల సాగుకు సిద్ధమయ్యారు. అయితే రైతు భరోసా ఎప్పుడిస్తామనే విషయం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో రైతులు అయోమయంలో ఉన్నారు.మండలంలో 20 వేల ఎకరాల పైచిలుకు వ్యవసాయ సాగు భూములు ఉండగా, వాటిలో ఏటా సుమారు 20 వేల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. కాగా గడిచిన వర్షాకాలంలో అతివృష్టి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాలను రవిచూశారు.
నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం సైతం అందలేదు. కాగా ఈ యాసంగి సీజన్లో అయినా సకాలంలో పంటలు సాగు చేసుకుందామంటే సాగు పెట్టుబడి కోసం ఎదురుచూపులు తప్పడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు.ఈ యాసంగిలో 14 వేల ఎకరాల్లో వరి,10 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.మొత్తం రైతులు 9157 ఉండగా,ఇందులో 8337 మంది రైతులకు గతంలో రూ.9.49 కోట్ల రైతు భరోసా అందినట్లుగా తెలుస్తోంది.
ఏటా పెరుగుతున్న ఖర్చులు..
ఏటా పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి.అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు సాగు చేయాలనే తపనతో వివిధ కంపె నీలు చెప్పే మాయ మాటలు నమ్మి రైతులు అధి కంగా విత్తనాలకే డబ్బులు వెచ్చిస్తున్నారు. ఒక్క ఎకరాకు విత్తనాల కోసమే రూ.5 వేల నుంచి మొదలుకొని రూ. 6 వేల వరకు చెల్లిస్తున్నారు.ఇక దుక్కులు దున్నటం, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు నివారణ మందులు, నాటుకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు వస్తోంది. కాగా పెట్టుబడి సాయం సకాలంలో చేతికందితే వాటికి కొంత కలిపి పంటసాగుకు ఉపయోగించుకుందామని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఈ రబీ సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకం గురించి ఇప్పటి వరకు ఎలాం టి సమాచారం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.



