నవతెలంగాణ – హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి గంజాయి రవాణా చేస్తున్న ఓ బీటెక్ యువతితో పాటు ఏడుగురు సభ్యుల ముఠాను అనకాపల్లి జిల్లా నాతవరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 74 కిలోల గంజాయి, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ సుమారు రూ. 33 లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా మాడుగులపేటకు చెందిన గాది రేణుక బీటెక్ చదివి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది. అయితే, ఆ ఉద్యోగం మానేసి సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి రవాణా మార్గాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన సూర్య కాళిదాసు మదన్ కుమార్, ముత్తుతో పాటు స్థానిక ప్రాంతాలకు చెందిన పడ్డూరి ప్రసాద్, అండెంగుల రవికుమార్, లలిత కుమారి, పొన్నగంటి మణికుమారితో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది. నిందితులు గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో నాతవరం పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.



