తెలంగాణ నిర్మాణ రిపోర్టును ప్రవేశపెట్టిన వీఎస్ రావు
విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రతినిధి
రాష్ట్రంలో గత మహాసభ నిర్దేశించిన విధంగా ప్రణాళికాబద్ద కృషి జరిగిందని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్ రావు తెలిపారు. సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభల సందర్భంగా శుక్రవారం ఆయన తెలంగాణ నిర్మాణ రిపోర్టును ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఉత్పత్తి రంగంపై దృష్టి పెట్టి పని చేశామని తెలిపారు. కాంట్రాక్టు, నాన్ కాంట్రాక్టు వర్కర్స్లో కాంపెయిన్ చేయాలన్న కోల్కత్తా కౌన్సిల్ నిర్ణయం మేరకు సర్వేలు చేసి, వాటి ఆధారంగా కరపత్రాలు, వినతిపత్రాలు ఇచ్చి, జిల్లాల పరిధిలో జాతాలు నిర్వహించామని తెలిపారు.దీంతో కొత్త సంబంధాలు వచ్చాయని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై 2025 ఆగస్టు నెలలో చేసిన కాంపెయిన్స్ ఫలితంగా అనేక పరిశ్రమల్లో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న నాలుగు రంగాల్లో తగిన కృషి జరిగిందని పేర్కొన్నారు. అలాగే కోల్, విద్యుత్, రైల్వే వంటి రంగాల్లో కృషి పెరిగిందని చెప్పారు. వర్గ సంఘాల ఐక్య కార్యాచరణ కృషి పెరిగిందన్నారు.
సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ మధ్య సమన్వయంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభ సందర్భంగా 45 రోజుల్లోనే మొత్తం జిల్లాలోని 492 గ్రామాల్లో సమన్వయ కమిటీలు వేసిన అనుభవాన్ని తీసుకుని, ప్రస్తుతం మూడు సంఘాల ఆధ్వర్యంలో జరగాల్సిన క్యాంపెయిన్ దృష్టిలో ఉంచుకుని 2026 జనవరి 18 వరకు అన్ని గ్రామాల్లో సీఐటీయూ సమన్వయ కమిటీలను వేయాలనీ, అవకాశం ఉన్న ప్రతి గ్రామంలో మూడు సంఘాల సమన్వయ కమిటీలు వేయాలని నిర్ణయించుకుని అమల్లోకి వెళ్ళామని తెలిపారు. ఇప్పటికే సీఐటీయూగా 515 మండల సమన్వయ కమిటీలు ఉండగా వివిధ క్యాంపెయిన్ సందర్భంగా 70శాతం ఫంక్షన్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 14 జిల్లాల్లో 919 గ్రామ సమన్వయ కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో శ్రామిక మహిళా రంగంలో కృషి పెరిగిందని తెలిపారు.
జిల్లాల్లో సీఐటీయూ నిర్ణయించిన టైర్ సిస్టం అమలవుతున్నదని తెలిపారు. 2024 ఫిబ్రవరి 16 న జరిగిన సెక్టారల్ సమ్మె సందర్బంగా 551 యూనియన్స్కు గాను 498 యూనియన్స్, 2025 జులై 9 సమ్మె సందర్బంగా 515 యూనియన్స్ కమిటీ సమావేశాలు జరిగాయని తెలిపారు.ఆ సమ్మె సందర్బంగా 1.20 లక్షల బుక్లెట్ లు కార్మికులకు అందించామని తెలిపారు. పరిశ్రమల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై రెగ్యులర్ కార్మిక సంఘాలు కృషి చేస్తున్న ఫలితంగా శాండ్విక్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ అయ్యారని వివరించారు. కిర్బీ పరిశ్రమలో కూడా కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ అయ్యారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రాంకీ యూనియన్ చేసిన ఫలితంగా 12వందల మందికి పైగా కార్మికులు రెగ్యులరయ్యారని తెలిపారు. వలస కార్మికుల సమస్యలపై అనేక జిల్లాల్లో సర్వేలు చేసి సమస్యలు గుర్తించామన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. నివాస ప్రాంతాల్లో కృషి పెరిగిందని వివరించారు.



