Sunday, April 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసెన్సస్ 2027..వివరాలు స్వయంగా నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

సెన్సస్ 2027..వివరాలు స్వయంగా నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో సెన్సస్ 2027 ప్రక్రియ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన వివరాలను అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా నమోదు చేసి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వయం నమోదు) ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఈ ప్రక్రియ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లను కలిపి ఒకే యూనిట్‌గా ఈ జనగణన చేపడుతున్నారు. మే 10 వరకు ప్రజలు స్వచ్ఛందంగా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ 15 రోజుల పాటు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

పౌరులు se.census.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి, తమ వివరాలను సమర్పించవచ్చు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో గృహ, వసతులు, ఆస్తులకు సంబంధించిన 33 ప్రశ్నలు ఉంటాయి. ఎలాంటి పత్రాలు అవసరం లేదని, 15-20 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వివరాలు సమర్పించాక వచ్చే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ (ఎస్ఈ ఐడీ)ని, వెరిఫికేషన్ కోసం వచ్చే సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి డిజిటల్ జనగణన కావడం విశేషం. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సెన్సస్ కూడా ఇదే. ఈసారి కులగణన కూడా చేపట్టనున్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించే ప్రక్రియ ఉంటుంది. ఈ కార్యక్రమంలో సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -