నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించడంపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ తర్వాత, బెంగాల్లో కమలం పార్టీ విజయంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి ప్రజాదరణ తగ్గుతున్న సమయంలో బీజేపీ బెంగాల్లోకి ఎలా ప్రవేశించిందో చెప్పాలని నిలదీశారు. మోదీ వేవ్ బాగా ఉన్న సమయంలోనూ ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలలో బీజేపీ గెలవలేకపోయిందని అన్నారు.
2015లో ఢిల్లీలో, 2016లో బెంగాల్లో బీజేపీకి మూడు సీట్ల చొప్పున మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. కానీ మోడీ ప్రజాదరణ అట్టడుగు స్థాయికి పడిపోయిన ప్రస్తుత సమయంలో అవే ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలలో ఎలా గెలిచిందో చెప్పాలని అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. మన దేశం ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2025 ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటమిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచేందుకు ‘ఓట్ల తొలగింపు’ అనే వ్యూహాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. 2025లో ఢిల్లీలో, ఇప్పుడు బెంగాల్లో జరిగింది ఇదే అని తెలిపారు.



