కేంద్రం, రాష్ట్రాలు టీమిండియాలా కలిసి పనిచేయాలి
నిటి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ
సమన్వయం అవసరం : నిటి ఆయోగ్ పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రం, రాష్ట్రాలు టీమిండియా లాగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యమూ అసాధ్యం కాదని ప్రధాని మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో గల భారత్ మండపంలో ప్రధాని అధ్యక్షతన నిటి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ‘వికసిత రాజ్యం కోసం వికసిత భారత్-2047’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)ల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు(ఎల్జీలు) పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మోడీ అధ్యక్షతన జరుగుతున్న మొదటి ప్రధాన సమావేశం ఇదే కావటం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అభివృద్ధి వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. ”మనం అభివృద్ధి వేగాన్ని పెంచాలి. కేంద్రం, అన్ని రాష్ట్రాలూ కలిసి వచ్చి టీమిండియాలాగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యమూ అసాధ్యం కాదు. వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యం. ప్రతి రాష్ట్రం వికసితం అయినప్పుడు, భారత్ వికసితం అవుతుంది. ఇది దాని 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్ష” అని మోడీ అన్నారు.
దీర్ఘకాలిక, సమగ్ర దార్శనిక పత్రాలు రూపొందించాలి : నిటి ఆయోగ్
వికసిత రాజ్యం కోసం వికసిత భారత్ అనే భావన రాష్ట్రాలు జాతీయ ప్రాధాన్యతలు, స్థానిక వాస్తవాలకు అనుగుణంగా దీర్ఘకాలిక, సమగ్రమైన దార్శనిక పత్రాలను రూపొందించాలని నిటి ఆయోగ్ పిలుపునిచ్చింది. ఈ దార్శనిక పత్రాలు కాలపరిమిత లక్ష్యాలను కలిగి ఉండాలనీ, అవి రాష్ట్రాల భౌగోళిక, జనాభా పరమైన ప్రత్యేకతలను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, సుస్థిరత, సాంకేతికత, పాలన సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించటం ద్వారా రాష్ట్రాలు ఈ లక్ష్యాలను సాధించగలవని వివరించింది. డేటా ఆధారిత ప్రక్రియలు, ఫలిత ఆధారిత మార్పును ప్రోత్సహించే చర్చలు జరిగాయి. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు, సమాచార సాంకేతికత (ఐసీటీ) ఆధారిత మాద్యమాలు, పర్యవేక్షణ, మదింపు విభాగాలతో జవాబుదారీతనం వంటివి కీలకమైన అంశాలుగా ఉన్నాయి. ఈ చర్యలు రాష్ట్రాలు తమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి సహాయపడతాయని నిటి ఆయోగ్ అభిప్రాయపడింది. ఈ సమావేశంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివద్ధిని మెరుగుపరచడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై కూడా చర్చించారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం
దేశవ్యాప్తంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, వ్యాపారవేత్తలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, ఉద్యోగ అవకాశాలను పెంచడం వంటి వ్యూహాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రాలు తమ ప్రత్యేక బలాలను ఉపయోగించుకుని, ఈ లక్ష్యాలను సాధించేందుకు సమర్థవంతమైన విధానాలను రూపొందించాలని నిటి ఆయోగ్ సూచించింది. కేంద్రం, రాష్ట్రాలు, యూటీల మధ్య సమన్వయాన్ని పెంచే ఒక వేదికగా పనిచేస్తుందని వివరించింది. దేశం ఎదుర్కొంటున్న అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి, భారత్ను వికసిత దేశంగా మార్చడానికి రాష్ట్రాలు ప్రధాన భాగస్వాములుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. సమగ్రమైన, సుస్థిరమైన అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర సహకారం అత్యంత కీలకమని నిటి ఆయోగ్ నొక్కి చెప్పింది. ఈ సమావేశానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ గైర్హాజరు అయ్యారు. సాధారణంగా, పూర్తి కౌన్సిల్ సమావేశం ప్రతి ఏడాదీ జరుగుతుంది. గతేడాది జులై 27న దీనిని నిర్వహించారు. కౌన్సిల్ మొదటి సమావేశం ఫిబ్రవరి 8, 2015లో జరిగింది. ఈ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూటీల ఎల్జీలు, పలువురు కేంద్ర మంత్రులు ఉంటారు. నిటి ఆయోగ్కు ప్రధాని చైర్మెన్గా ఉంటారు.
అభివృద్ధి వేగాన్ని పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES