Monday, February 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅసమానతలు, దోపిడీ నిర్మూలనకే కమ్యూనిస్టుల పోరాటం

అసమానతలు, దోపిడీ నిర్మూలనకే కమ్యూనిస్టుల పోరాటం

- Advertisement -

దేశ సంపద అందరికీ అందటం లేదు
ఖమ్మం జిల్లా లింగాలలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
మట్టూరి భద్రయ్య, సీతారత్నమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థూపావిష్కరణ

నవతెలంగాణ-కల్లూరు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా నేటికీ ప్రజల్లో అసమానతలు తొలగిపోలేదని, దేశ సంపద కొంతమంది చేతుల్లోనే ఉందని, అందుకే కమ్యూనిస్టులు పోరాటం చేయాల్సి వస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు మట్టూరి భద్రయ్య, సీతారత్నమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆదివారం వారి స్మారక స్థూపాన్ని జాన్‌వెస్లీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భద్రయ్య 30 సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పేదలకు అండగా ఉన్నారని, గ్రామాన్ని అభివృద్ధి చేయటంతోపాటు అందరినీ కలుపుకుపోయారని, అందుకే ఇన్నేండ్లపాటు సర్పంచ్‌గా ఎన్నికవ్వగలిగారని కొనియాడారు. ఇలాంటి నాయకుల జీవితాలే యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

దేశంలో కోట్లాదిమంది కార్మికులు, వ్యవసాయ కూలీలకు కనీస వేతనం అమలు కాక అవస్థలు పడుతున్నారని అన్నారు. రోజూ 8 గంటల పని చేసే కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలో రైతులకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పైగా వారిని వ్యవసాయానికి దూరం చేసి వేల ఎకరాల్లో కార్పొరేట్‌ వ్యవసాయాన్ని తీసుకు రావడం కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దోపిడీ వ్యవస్థ నిర్మూలన అయితేనే అసమానతలు తొలగిపోతాయని, సమస మాజం స్థాపన జరుగుతుందని, అది కమ్యూనిస్టులతోనే సాధ్యమ వుతుందని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ.. ఎర్రజెండా కనిపిస్తే సహించే పరిస్థితి లేదని, వారు వచ్చినప్పుడు జెండాలు తొలగించే వాళ్ళని, అలాంటి నిర్బంధాల్ని భద్రయ్య ఎదిరించి నిలబడ్డారని గుర్తుచేశారు.

కల్లూరు మండలంలో లింగాల, ఎర్రబోయినపల్లి గ్రామాలు కమ్యూనిస్టులకు బలమైన గ్రామాలుగా ఉండేవని, ఎలాంటి ఒత్తిడినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే వారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు తాతా భాస్కరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్‌, రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, ఎం.సుబ్బారావు, సత్తుపల్లి డివిజన్‌ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, వైరా డివిజన్‌ కార్యదర్శి భూక్య వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, చలమా ల విఠల్‌ రావు, సత్తుపల్లి డివిజన్‌ నాయకులు తన్నీరు కృష్ణార్జునరావు, తల్లాడ, వేంసూరు, సత్తుపల్లి, నేలకొండపల్లి మండల కార్యదర్శులు అర్వపల్లి జగన్మోహన్‌రావు, కొలిక పోవు సర్వేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు పాలిపు రామారావు, ఐడీసీ అభివృద్ధి మువ్వ విజయబాబు, భద్రయ్య కుటుంబం సభ్యులు సుధారాణి, స్టాలిన్‌, సత్యవతి, కుమార్తె సూర్యదేవర రమాదేవి, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -