ఈపీఆర్ నిబంధనల లక్ష్యాలు మూడేండ్లుగా పూర్తి కాని వైనం
ప్లాస్టిక్ బాటిళ్లు, మూతల వ్యర్థాల నిర్వహణలో తీవ్ర లోపాలు
ఎన్జీటీకి సీపీసీబీ నివేదిక.. పర్యావరణవేత్తల ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో హార్డ్ ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ విషయంలో తయారీ కంపెనీలు ప్రభుత్వ లక్ష్యాల ను చేరుకోలేకపోయాయని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) వెల్లడించింది. ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి సమర్పించిన నివేదికలో పేర్కొంది. గత మూడేండ్ల కాలంలో ‘రిజిడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్’ వ్యర్థాల నిర్వహణలో 76 శాతం మాత్రమే లక్ష్య సాధన జరిగిందని సీపీసీబీ వివరించింది. ఈ కాలానికి ప్రభుత్వం నిర్ణయించిన ఃటార్గెట్ 58.67 లక్షల టన్నులు కగా.. వాస్తవంగా 44.64 లక్షల టన్నుల ప్లాస్టిక్ మాత్రమే రీసైక్లింగ్ లేదా ప్రాసెసింగ్ చేయబడిందని పేర్కొంది. అయితే ఈ నివేదిక దేశంలో ప్లాస్టిక్ మహమ్మారి ప్రమాదాన్ని చూపిస్తున్నదని పర్యావరణ వేత్తలు అంటున్నారు. కేంద్రం పెద్ద పెద్ద పర్యావరణ విధానాలు ప్రకటించి, అమలులో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాస్టిక్ నీటి బాటిళ్లు, శీతల పానీయాల బాటిళ్లు, వాటి మూతలు రిజిడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కిందకు వస్తాయని సీపీసీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవస్థ ‘ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్)’ అనే పర్యావరణ విధానం కింద అమలవుతోంది. ఈ విధానం ప్రకారం వినియోగదారులు ఉపయోగించి పారేసిన తర్వాత ఉత్పత్తి వ్యర్థాలను సేకరించి, రీసైక్లింగ్ చేయాల్సిన బాధ్యత ఆయా తయారీ కంపెనీలదే. దేశంలో ప్రస్తుతం సుమారు 3,040 ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నట్టు సీపీసీబీ వివరించింది. ప్లాస్టిక్ బాటిళ్లకు వేరుగా ఉండే మూతల వల్ల పెరుగుతున్న కాలుష్యంపై దాఖలైన ఒక పిటిషన్ నేపథ్యంలో సీపీసీబీ ఈ అఫిడవిట్ సమర్పించింది. దీనిపై ఎన్జీటీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. అనేక దేశాల్లో ‘టెథర్డ్ క్యాప్స్’ అనే విధానాన్ని అమలు చేస్తున్నారని సీపీసీబీ వివరించింది. ఇందులో బాటిల్ మూత పూర్తిగా వేరుపడకుండా బాటిల్కు అనుసంధానంగా ఉంటుంది. దీంతో బాటిల్తో పాటు మూత కూడా సేకరణకు వెళ్లి రీసైక్లింగ్ సులభమవుతుందని వివరించింది.
ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో మోడీ సర్కారు విఫలం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై ‘పర్యావరణ నాయకత్వం’ గురించి మాట్లాడుతూనే.. దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు సీపీసీబీ తాజా నివేదికనే వారు ఉదాహరణగా చూపెడుతున్నారు. ఇక సీపీసీబీ నివేదిక దేశంలో ఒక పెద్ద సమస్యను బయటపెడుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్లాస్టిక్ వ్యర్థాల బాధ్యత కంపెనీలదేనని చట్టాలు చెప్తున్నప్పటికీ.. అమలులో మాత్రం భారీ లోపాలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు. ముఖ్యంగా నీటి బాటిళ్లు, కూల్డ్రింక్ బాటిళ్ల మూతలు చిన్నవిగా ఉండటం వల్ల అవి ఎక్కువగా చెత్తలో, కాలువల్లో, సముద్రాల్లో చేరిపోతాయనీ, ఇవి పక్షులు, జంతువులకు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయని వివరిస్తున్నారు. ప్రభుత్వాలు కేవలం లక్ష్యాలు ప్రకటించడం సరిపోదనీ, కంపెనీలపై కఠిన జరిమానాలు, పారదర్శక ట్రాకింగ్ వ్యవస్థ, టెథర్డ్ క్యాప్స్ వంటి తప్పనిసరి మార్పులు తీసుకురాకపోతే దేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రిం చడం కష్టమని హెచ్చరిస్తున్నారు. వినియోగ దారుల అవగాహనతో పాటు తయారీ కంపెనీలపై నిజమైన బాధ్యత అమలు కావడం చాలా అవసరం ఉందని నొక్కి చెప్తున్నారు.



