బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్న మధ్యతరగతి జీవులకు నిరాశే మిగిలింది. చెదురుమదురు ప్రకటనలు కన్పించినప్పటికీ అవి నిర్ణయాత్మక సంకేతాన్ని ఇవ్వలేకపోయాయి. తనకు ఓటు బ్యాంకుగా కొనసాగుతున్న అగ్రవర్ణాలకు కూడా ప్రభుత్వం మొండిచేయే చూపింపింది. గత సంవత్సరం ఇచ్చిన విధంగా ఈసారి ఎలాంటి ఆదాయపన్ను రాయితీలు కల్పించలేదు.గత సంవత్సరపు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ ఏడు సందర్భాలలో మధ్యతరగతి జీవుల ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఈసారి ఆ ఊసే లేదు. వేతన జీవుల కోసం ఆమె కేవలం ఒకే ఒక ప్రకటన చేశారు. ఆదాయపన్ను పత్రాలను, నిబంధనలను సరళతరం చేస్తామని, వాటిని త్వరలోనే నోటిఫై చేస్తామని మాత్రం చెప్పారు. సామాన్య ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదాయపన్ను రిటర్న్లు దాఖలు చేయవచ్చునని తెలిపారు.



