నవతెలంగాణ హైదరాబాద్: యుద్ధంలో పద్యానిది ప్రత్యేక స్థానమని దాశరథి నిరూపించారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. వాణీ ప్రసాద్ పద్య ప్రక్రియ ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ రవీంద్ర భారతిలో నేడు నిర్వహించిన ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ ‘ స్వీయ పద్యగానం అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పద్య కవుల గానంతో తెలంగాణ తల్లి పులకించి పోయింది అని వాణీప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. పద్యానికి ఉన్న ధారణశక్తే దాశరథిని పద్యం వైపు నడిపించింది అని పద్యం గొప్పతనాన్ని వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అన్ని జిల్లాల నుండి 50 మంది పద్య కవులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవశ్యకతను, చారిత్రక నేపథ్యాన్ని తమ పద్యగానం ద్వారా వినిపించారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య వెల్దండ నిత్యానంద రావు, ఆచార్య మసన చెన్నప్ప, డాక్టర్ సంగనభట్ల నరసయ్య, దోరవేటి చెన్నయ్య, డా.నలవోలు నరసింహారెడ్డి, గండ్ర లక్ష్మణరావు, కాంచనపల్లి తదితర ప్రముఖ పద్యకవులు పాల్గొని తమ పద్యగానంతో సభికులను అలరించారు.



