- Advertisement -
కుమార్తెను మెడిసిన్లో జాయిన్ చేయడానికి వెళ్లిన కుటుంబం
నవతెలంగాణ-హయత్ నగర్
మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి గౌడ్ సతీమణి డాక్టర్ సూచి యాష్కికి అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తన చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కిని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆస్పత్రిలో ఎండీ కోర్సులో చేర్పించి న్యూయార్క్కు తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ప్రయాణిస్తున్న కారు వర్షం కారణంగా అదుపుతప్పి పల్టీలు కొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో డాక్టర్ సూచి యాష్కికి రిబ్స్ విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మధుయాష్కి గౌడ్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. డాక్టర్ గగన యాష్కి ఇటీవల న్యూయార్క్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, ఆమె కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారంతా అమెరికా వెళ్లారు. కుమార్తెను ఎండీ కోర్సులో చేర్పించే క్రమంలో లగేజీ ఎక్కువగా ఉండటంతో డాక్టర్ సూచి యాష్కి, మధుయాష్కి గౌడ్ వేర్వేరు కార్లలో ప్రయాణించినట్టు తెలిసింది. తిరుగు ప్రయాణంలో డాక్టర్ సూచి యాష్కి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. డాక్టర్ సూచి యాష్కి త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
- Advertisement -



