నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్లో పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సేవలను క్రమబద్ధీకరించాలని, మెరుగైన వేతనాలు, ప్రాథమిక ఉపాధి ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. దోడ జిల్లాలో గురువారం నిరసన చేపట్టారు. చెనాబ్ వ్యాలీ సఫాయి కర్మచారి యూనియన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రోడ్లలపై బైటాయించారు. ప్రభుత్వాల నుండి సంవత్సరాలుగా నెరవేరని హామీల కారణంగా తమ ఆందోళనను తీవ్రతరం చేయక తప్పలేదని నిరసనకారులు తెలిపారు.
చెనాబ్ వ్యాలీ పారిశుధ్య కార్మికుల చైర్మన్, దోడా కమిటీ యూనియన్ ప్రెసిడెంట్ అయిన ఇర్షాద్ అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..తమ డిమాండ్లకు ఎలాంటి పరిష్కారం లభించకుండా కార్మికులు దశాబ్దానికి పైగా నిరసన తెలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము 2014 నుండి నిరంతరంగా ఇలాంటి సమ్మెలు చేస్తున్నామని, ప్రతిసారీ తమకు కేవలం ‘లాలిపాప్’ అందిస్తూ, తప్పుడు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు 2026, అయినా అధికారులు తమ డిమాండ్లను ఇప్పటికీ నెరవేర్చలేదని అహ్మద్ తెలిపారు. పారిశుధ్య కార్మికులు గతంలో శ్రీనగర్కు వెళ్లి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సహా సీనియర్ అధికారులను కలిశారని, కానీ క్రమబద్ధీకరణ హామీలు ఎన్నడూ కార్యరూపం దాల్చలేదని, తమకు వేరే మార్గం లేదు, వీధుల్లోకి రాక తప్పలేదన్నారు.



