Wednesday, February 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిట్రంప్‌ మరో గడువు : పురోగతిలేని ఉక్రెయిన్‌ శాంతిచర్చలు!

ట్రంప్‌ మరో గడువు : పురోగతిలేని ఉక్రెయిన్‌ శాంతిచర్చలు!

- Advertisement -

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య మంగళవారం నాడు 1,447వ రోజుకి చేరింది. తనకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు చేసిన కుట్రను వమ్ము చేసేందుకు ఎనిమిదేళ్లు వేచిచూసిన రష్యా ఇక లాభం లేదని 2022 ఫిబ్రవరి 24న సైనిక చర్యకు పూను కుంది, మరికొద్ది రోజుల్లో ఐదవ ఏడాదిలో ప్రవేశించనుంది. ఈ వివా దాన్ని పరిష్కరించటంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమైంది. తొలి రోజుల్లో ఒప్పందం చేసుకొనేందుకు ఉక్రెయిన్‌ ముందుకు వచ్చినప్పటికీ ఐరోపా దేశాలు అడ్డుపడ్డాయి. అనేక యుద్ధాలను ఆపిన తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వలేదని మండి పడుతున్న ”అపరశాంతి దూత ” డోనాల్డ్‌ ట్రంప్‌ తాను గద్దెనెక్కిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పాడు. జనవరి 19తో ఏడాది గడచిపోయింది, ‘జూన్‌ నెల వరకు కొట్టుకోండి, చంపుకోండి ఆ లోగా పోరును ముగించండి’ అంటూ తాజాగా గడువు విధించాడు.దాడుల విరమణ ప్రతిపాదనలపై రెండు పక్షాలూ ఏకాభిప్రాయానికి రావటం లేదు.అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప కనుచూపు మేరలో పరిష్కారం కనిపించటం లేదు.చివరిసారిగా గతవారంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబూదాబీలో అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ఎవరికి తోచిన భాష్యాలు వారు చెబుతున్నారు.

నిజానికి ఉక్రెయిన్‌ సంక్షోభానికి నాంది 2014లోనే పడింది. అంతకు ముందు రష్యాను కూడా తమ జి-7 ధనిక దేశాల కూటమిలో చేర్చుకున్నప్పటికీ తెరవెనుక వ్యతిరేక కుట్రలకు తెరలేపటంతో రష్యా ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఉక్రెయిన్‌లో రష్యాకు అనుకూలంగా ఉన్న పాలకులను మార్చి తమతొత్తులను నాటో కూటమి అధికారానికి తీసుకురావటం, కుట్రలకు పూనుకోవటంతో గతంలో తన ప్రాంతంగా ఉన్న ఉక్రెయిన్‌లోని క్రిమియా దీవిని రష్యా 2014లో విలీనం చేసుకుంది. తర్వాత ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటుకు మద్దతిచ్చింది. ఇప్పుడు ఆ ప్రాంతంపై రష్యా దాదాపుగా పూర్తిగా ఆధిపత్యం కలిగి ఉంది. అక్కడ ఏర్పడిన తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాలని, ప్రత్యేక దేశంగా పరిగణించాలని రష్యా చెబుతోంది.ససేమిరా కుదరదని ఉక్రెయిన్‌ అంటోంది. గత నాలుగేళ్లుగా మెల్లమెల్లగా ఇరవై శాతం ప్రాంతాన్ని పుతిన్‌ సేనలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి, ఆప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. చర్చలను పట్టించుకోకుండా ఇరు పక్షాలూ పరస్పరదాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి.

ఈ నేపధ్యంలో ఈ సంక్షోభంలో గెలుపెవరిది అనే చర్చ మొదలైంది.రెండు నెలల్లోనే ఉక్రెయిన్‌కు పాఠం చెప్పాలన్న పుతిన్‌ వ్యూహం సాధ్యం కాదని తేలింది.అదే విధంగా రష్యాను చావుదెబ్బతీసి వెనక్కు నెట్టారని పశ్చిమదేశాలు, వాటి కనుసన్నలలో పని చేసే మీడియా చేసిన ప్రచారం, చూపిన హాలీవుడ్‌ చిత్రాలు కూడా వాస్తవం కాదని తేలిపోయింది. ఉక్రెయిన్‌లో నాజీలకు స్థానం లేకుండా చేయటం, తూర్పు ప్రాంతంలో డాన్‌టెస్క్‌, లుహానస్క్‌, తదితర ప్రాంతాలతో కూడిన డాన్‌బాస్‌ ప్రాంత రక్షణకు, అక్కడ ఉన్న రష్యన్‌ మైనారిటీలకు రక్షణ, మిలిటరీ రహిత ప్రాంతంగా మార్చే లక్ష్యంతో సైనిక చర్య తీసుకున్నట్లు పుతిన్‌ ప్రకటించాడు. తర్వాత పరిణామాలు వేరే విధంగా సంభవించాయి. ఉక్రెయిన్‌లోని మౌలిక సదుపా యాలను దెబ్బతీయటం ద్వారా లొంగదీసుకొనేందుకు రష్యా దాడులు జరుపుతున్నది. ఉక్రెయిన్‌ గెలిచే అవకాశం లేదని స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఎలా పరిష్కారం అవుతుం దనేది ఆసక్తికరంగా మారింది. గెలిచే అవకాశాలు లేని ఉక్రెయిన్‌కు ఎంతకాలం మద్దతివ్వాలి, అక్కడి నుంచి వచ్చిన శరణార్ధులను ఎంతకాలం భరించాలనే చర్చ ఐరోపాలో ఉంది. ఇప్పటివరకు నాటో కూటమి దేశాలు అందచేసిన సమాచారం, ఆయుధాలతో ఉక్రెయిన్‌ ప్రతిఘటన కొనసాగిస్తున్నది. రష్యాపై విధించిన ఆంక్షలు ఇంతవరకు పెద్దగా ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు.చైనా పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుం టున్నది. అమెరికాలో వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న యుద్ధ అధ్య యనాల సంస్థ అంచనా ప్రకారం 2025లో ప్రతినెలా సగటున 176 చదరపు మైళ్ల (వరంగల్‌ నగరం, పరిసరాలంత) ప్రాంతాన్ని రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. రాజధా నిపై గాక ఇతర ప్రాంతాలపై పుతిన్‌ సేనలు కేంద్రీకరిస్తున్నాయి. కొంత ప్రాంతాన్ని రష్యాకు స్వాధీనం చేస్తా మంటూ ట్రంప్‌ యంత్రాంగం రూపొం దించిన 28 అంశాల పరిష్కార మార్గాన్ని ఎవరూ అంగీకరించలేదు. క్షిపణులతో సహా ఉక్రెయిన్‌ మిలిటరీ శక్తి పరిమితం కావాలని, నాటోలో చేరటం లేదా నాటో శాంతిస్థాపక దళాలను ఉక్రెయిన్‌లో ఉంచకూడదని రష్యా డిమాండ్‌ చేస్తోంది. దీన్ని అంగీకరిస్తే తాము పాదాక్రాంతులమైనట్లే అంటూ కుదరదని ఉక్రెయిన్‌ చెప్పింది.డాన్‌బాస్‌ ప్రాంతాన్ని మిలిటరీ రహిత ప్రాంతంగా అంగీకరిస్తామని, అమెరికా, నాటో కూటమి నుంచి తమకు రక్షణ హామీ కావాలని పట్టుబడుతోంది. విజయం తనవైపే ఉందని, ఉక్రెయిన్ను చీల్చటం తమ లక్ష్యమని పుతిన్‌ చెబుతున్నాడు.

ఉక్రెయిన్‌ సంక్షోభంలో మరణించిన సైనికులు, జరిగిన నష్టాల గురించి అంచనాలు, అతిశయోక్తులు తప్ప నిజానిజాలు వెల్లడి కావటం లేదు. రష్యా వైపు నుంచి పన్నెండు లక్షల మంది, ఉక్రెయిన్‌కు చెందిన వారు 20లక్షల మంది మరణించినట్లు సిఎస్‌ఐఎస్‌ అనే సంస్థ అంచనా వేసింది. రష్యా పన్నెండు లక్షల మందితో పోల్చితే ఉక్రెయిన్‌ పక్షంలో మరణించిన, గాయపడిన లేదా కనిపించకుండా పోయిన వారి సంఖ్య ఐదు నుంచి ఆరులక్షల వరకు ఉందని సిఎన్‌ఎన్‌ మీడియా విశ్లేషకుడు చెబుతు న్నారు. బ్రిటన్‌ రక్షణ శాఖ అంచనా రష్యా వైపు నష్టాల సంఖ్య పదిలక్షలు. రష్యా మిలిటరీ, యుద్దానికి నిధులు సమకూర్చే మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఉక్రెయిన్‌ దాడులు చేస్తుండగా, విద్యుత్‌, మంచినీరు వంటి వ్యవస్థలను ధ్వంసం చేయటం పుతిన్‌ సేనల లక్ష్యాలుగా ఉన్నాయి. గత ఏడాది డ్రోన్‌లతో జెలెనెస్కీ దళాలు రష్యా అదుపులో ఉన్న ఉక్రెయిన్‌ ప్రాంతాలు, రష్యా భూభాగం మీద 371 దాడులు జరిపినట్లు ఒక మీడియా సంస్థ పేర్కొ న్నది. వాటిలో సైనిక పరిశ్రమలపై 91, మిలిటరీ స్థావరాలపై 25,వైమానిక కేంద్రాలపై 16 దాడులు జరిగాయి. రష్యాకు వచ్చే రాబడిలో 40శాతం చమురు, గ్యాస్‌ల నుంచే వస్తున్నది. అందువలన పశ్చిమ దేశాలిచ్చిన సమాచారంతో ఆ వ్యవస్థలపై ఉక్రెయిన్‌ దాడులు చేస్తున్నది. చమురుశుద్ధి కేంద్రా లపై 88, ఉపకేంద్రాలపై 30,చమురు నిల్వకేంద్రాలపై 28, రవాణా సదుపాయాలపై 28, రేవులపై 15, గ్యాస్‌ వ్యవస్థలపై ఆరుసార్లు దాడులు జరిగాయట. సైనికులను చేరవేసే రైల్వే మౌలికసదుపాయాలపై 36 దాడులు జరిగాయి. ఈ దాడులతో రష్యా రాబడి బాగా తగ్గిందని అంచనా. ఏటా 160 బిలియన్‌ డాలర్ల మేర మాస్కో మిలిటరీ ఖర్చు ఉందని చెబుతున్నారు.

రష్యా జరుపుతున్న దాడులతో ఉక్రెయిన్‌కు జరిగిన నష్టాల గురించి పశ్చిమదేశాల మీడియా దాచిపెడుతున్నది. ఆ వివరాలు వెల్లడైతే జెలెన్‌స్కీకి ఇస్తున్న సాయంపై ఆ దేశాలలో వ్యతిరేకత వెల్లడయ్యే అవకాశం ఉంది. యుద్ధంలో రష్యా గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు వస్తుందనే ప్రచారంతో జనాలను మభ్యపెడుతూ ఆ పేరుతో ఆర్థిక, మిలిటరీ సాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం కీలకమైన పోక్రోవస్క్‌ ప్రాంతాన్ని పట్టుకొనేందుకు రష్యా, నిలుపుకొనేందుకు ఉక్రెయిన్‌ పోరాడుతున్నాయి, నిత్యం రాజధాని కీవ్‌పై దాడులు జరుగుతున్నాయి. అక్కడ రోజుల తరబడి విద్యుత్‌ సరఫరా లేదు, చలికాచుకొనే సదుపాయాలు వారం రోజులుగా పనిచేయటం లేదు.ఒకవైపు విపరీతమైన చలి, మరోవైపు ఎడతెగకుండా రష్యా చేస్తున్న దాడులతో పౌరులు సతమత మౌతున్నారు. జెలెన్‌స్కీ సేనలు యుద్ధ రంగం నుంచి పారిపోతున్నట్లు, రష్యన్లకు లొంగిపోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కీలకమైన రైల్వే కేంద్రంగా ఉన్న పోక్రోవస్క్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకొనేందుకు గత కొద్ది నెలలుగా పుతిన్‌ సేనలు ప్రయత్నిస్తున్నాయి. పట్టణ ఉత్తర ప్రాంతం తమ ఆధీనంలోనే ఉందని ఉక్రేనియన్‌ మిలిటరీ జనరల్‌ చెప్పాడు. అయితే ఆ ప్రాంతంలోకి కూడా రష్యా సేనలు చొచ్చుకు పోతున్నట్లు డీప్‌స్టేట్‌ అనే సంస్థ పరిశోధకులు చెప్పారు. ఈ పట్టణం పూర్తిగా, పక్కనే ఉన్న మైనోర్‌హార్డ్‌ అనే పట్టణంలో ఎక్కువ భాగం రష్యన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇదే చివరి పోరు కావచ్చని కూడా పేర్కొన్నారు.

అలాస్కాలో పుతిన్‌తో జరిపిన భేటీలో కుదిరిన ఒప్పందం నుంచి ట్రంప్‌ వెనక్కు పోతున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ చెప్పాడు. ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారం కావాలని అమెరికా కోరిందని, పోరు ఆగాలంటే డాన్‌బాస్‌ ప్రాంతం మొత్తాన్ని తమకు అప్పగించాలని అన్నాడు.అందరూ ఉక్రెయిన్‌ భద్రత గురించి మాట్లాడుతున్నారు తప్ప తమ గురించి ఎందుకు ఆలోచించటం లేదని రష్యన్‌ దౌత్యవేత్త గ్రుష్‌కో ప్రశ్నించారు. ఉక్రెయిన్‌కు రక్షణ ఉండాలని తాము కూడా అంగీకరిస్తామని, వివాదానికి మూలం తమ భద్రతకు తెచ్చిన ముప్పుగురించే గనుక దాని సంగతేమిటని రష్యన్‌ వార్తా సంస్థ ఇజ్వెస్తియాతో అన్నాడు. ఐరోపా యూనియన్‌ నేతల ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా రష్యా భద్రతా హామీల గురించి ప్రస్తావించటం లేదని, శాంతి ఒప్పందంలో అదే కీలకాంశమని, అది తేలకుండా ఒప్పందం అసాధ్యమన్నాడు.

జూన్‌లోగా మొత్తంగా యుద్ధాన్ని ముగించాలని డోనాల్డ్‌ ట్రంప్‌ తాజా గడువు విధించినట్లు జెలెన్‌స్కీ ప్రకటించాడు. వచ్చే వారంలో ఉభయపక్షాలను మరోసారి చర్చలకు పిలిచినట్లు చెప్పాడు. తాజా గడువులోగా అంగీకారానికి రాని పక్షంలో ఇరుపక్షాల మీద అమెరికా వత్తిడి పెంచనుందని కూడా అన్నాడు. తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తానని ట్రంప్‌ చెప్పాడు, అందుకోసం ప్రత్యేక రాయబారిగా కెయిత్‌ కెలోగ్‌ నియామకం జరిగింది. అయితే సదరు రాయబారి పరిష్కారానికి వంద రోజులు పడుతుం దన్నాడు. గతేడాది ఆగస్టులోగా ఒప్పందం కుదరాలని ట్రంప్‌ గడువు పెట్టాడు. ముసాయిదా ఒప్పందం 95శాతాన్ని అంగీకరించినట్లు డిసెంబరులో ప్రకటించాడు.అదీ జరగలేదు, శాంతి చర్చలు ప్రారంభమైన తరువాత 55వేల మంది తమ సైనికులు మరణించినట్లు జెలెన్‌స్కీ చెప్పాడు. గతవారంలో అబూదాబీలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. త్వరలో అమెరికాలోని మియామీలో చర్చలు జరుగుతాయని, తాము హాజరవుతున్నట్లు వెల్లడించాడు.జూన్‌ గడువును నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల ప్రచారానికి వినియోగించుకొనేందుకు ట్రంప్‌ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రతి సంక్షోభాన్ని అమెరికా పాలకవర్గం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం మామూలే!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -