నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (పీఎంయూవై) లబ్ధిదారులకు అందించే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి 4కు పరిమితం చేస్తున్నట్టు సోమవారం ఓ ఉన్నత ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పేద కుటుంబాల సగటు వాడకానికి అనుగుణంగానే ఈ మార్పు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.
2016 మే నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు. తొలినాళ్లలో ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ ఇవ్వగా, గత ఏడాది దాన్ని 9కి తగ్గించారు. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను 4కు కుదించారు. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ ఖనూజా మాట్లాడుతూ.. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగం దాదాపు నాలుగు సిలిండర్లుగానే ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.



