Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారం జాతరలో మహిళా సంఘాలకు భారీ ఆదాయం

మేడారం జాతరలో మహిళా సంఘాలకు భారీ ఆదాయం

- Advertisement -

రూ.6 కోట్ల పెట్టుబడికి రూ.3 కోట్లకు పైగా లాభం
ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో విజయం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమ్మక్క-సారలమ్మ మహా జాతర-2026 సందర్భంగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్‌) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు భారీ ఆదాయాన్ని ఆర్జించాయి. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డి.అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్‌ మార్గదర్శకత్వంలో జిల్లాలోని 10 మండలాలను కవర్‌ చేశారు. మొత్తం 565 ఆదాయ యూనిట్లను స్వయం సహాయక బృందాల ద్వారా ఏర్పాటు చేయగా వారు జాతర సమయంలో రూ.3 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని మేడారం జాతర ప్రాంగణంలో మహిళా సంఘాలకు అనుకూలమైన ప్రదేశాల్లో షాపులను కేటాయించేలా చూశారు. ములుగు జిల్లాలోని పది మండలాలకు చెందిన మహిళా సమాఖ్యల ద్వారా వివిధ రకాల వ్యాపార యూనిట్లు ఏర్పాట్లు చేయించి మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించారు.

మంత్రి సీతక్క స్వయంగా ఈ యునిట్లను ప్రారంభించి వారి వ్యాపారానికి విస్తృత ప్రచారం కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహకం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడంతో మహిళలు కూల్‌ డ్రింక్‌ సెంటర్లు, చికెన్‌ సెంటర్లు, ఇప్పపువ్వు లడ్డూ స్టాళ్లు, బ్యాంబూ చికెన్‌, క్యాంటిన్లు, స్నాక్స్‌ తదితర దుకాణాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఇతర వ్యాపార కార్యకలాపాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సమర్థంగా వినియోగించుకుని ఆర్థికంగా లాభపడ్డారు. ఈ వ్యాపారాల కోసం రూ.6 కోట్ల పెట్టుబడిని బ్యాంకులు, జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా సమకూర్చగా.. మొత్తం రూ.9.12 కోట్ల ఆదాయం లభించింది. పెట్టుబడి ఖర్చులు పోగా రూ.3 కోట్లకుపైగా లాభం వచ్చింది.

ఇందిరా మహిళా శక్తి ఘన విజయం
సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో అమలవుతున్న ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి ఇది నిదర్శనమని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వ ప్రొత్సాహకం, మహిళా సంఘాల పట్టుదల, ఆడ బిడ్డల శ్రమ ఫలితమని అభినందించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడుతూ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు ధఢమైన పునాది వేసిందని మంత్రి ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -