వెంటనే స్పందించి, మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది
తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని పోమాల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్రామంలోని మహిళా సమాఖ్య భవనం ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లో ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపం ఏర్పడి మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టారు. సంఘటనకు సంబంధించి ఫైర్ స్టేషన్ కు వారు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి ఫైర్ ఇంజన్ తో చేరుకొని మంటలను ఆర్పి పెను ప్రమాదాన్ని నివారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.




