నవతెలంగాణ – హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లోని ఆర్టీవో కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్న ఇసుక లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే, చెల్పూర్ ఆర్టీవో కార్యాలయం ముందు ఇసుక లారీలను తనిఖీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ లారీ ఆర్టీవో వెంకన్నపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రవాణా శాఖ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన వెంకన్న మృతి పట్ల జిల్లా యంత్రాంగం, రవాణా శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీవో కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, వెంకన్న కేవలం 15 రోజుల క్రితమే ఆర్టీవోగా బదిలీపై ఈ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.



