నవతెలంగాణ – మద్నూర్
మండల పరిధిలోని మేనూర్ గ్రామ హనుమాన్ దేవాలయ భూమిని ఎండోమెంట్ అధికారులు వేలం వేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుండి ఇన్స్పెక్టర్ కమలాబాయి, సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్, మేనూర్ ఆలయ కమిటీ చైర్మన్ విట్టల్ గురూజీలతో పాటు ఆ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ గ్రామపంచాయతీ ఆవరణంలో శుక్రవారం హజరయ్యారు.
అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆలయ భూమి వేలాన్ని మేనూరు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎందుకంటే సర్వే నెంబర్లు 148/1, 148/2లో 14 ఎకరాల 16 గుంటల భూమి ప్రభుత్వ భూమి అని అధికారులు చెబుతున్నారు. కానీ ఇదే భూమి మా పేరుపై కూడా ఉందని కొందరు అధికారులకు విన్నవించారు. దీనిపై కోర్టులో కేసు కూడా ఉందని, న్యాయం కోసం కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నామని, భూమి మాదా.. ఆలయానిదా అని విషయం కొలిక్కి రాకముందు మీరేలా కౌలుభూమిని వేలానికి వేస్తారని ప్రశ్నించారు. కేసు ఎవరి వైపు తీర్పు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్న తరుణంలో కౌలు దారుడు మోసపోవలసి వస్తే దేవాదాయ శాఖ ఆ కౌలు దారునికి డబ్బులు తిరిగి ఇస్తామంటూ రాతపూర్వకంగా రాసి ఇవ్వండి అంటూ పట్టుపట్టారు.
ఇది ఇలా ఉండగా గతంలో ఆలయ భూమి కౌలు డబ్బులు ఉన్న వాటిలో రూ.60 వేలు కమిటీ లేకుండానే ఎలా డ్రా చేస్తారని ప్రశ్నించారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వవలసిందేనని గ్రామస్తులంతా ఏకమమై వేలంపాటను అడ్డుకున్నారు. దీంతో చేసేదేంలేక అధికారులు గ్రామస్తులకు సమాధానం ఇవ్వలేక వాయిదా వేసి వెనుదిరిగి వెళ్ళిపోయారు.



