Sunday, March 1, 2026
E-PAPER
Homeసోపతితీపి తెలుగు

తీపి తెలుగు

- Advertisement -

అది యూనివర్సిటీ హాస్టల్‌. తన గదిలో కూర్చుని కవి దాశరథి రుబాయిలు చదువుతూ ఉన్నాడు తెలుగు రీసెర్చ్‌ స్కాలర్‌ ప్రదీప్‌.
‘పోస్ట్‌’ అన్న పిలుపుతో తల తిప్పి చూశాడు. రిజిస్టర్‌ పోస్ట్‌ అది. దానిలో ఏముందో ముందే ఊహించిన స్నేహితులందరూ ప్రదీప్‌ చుట్టూ చేరారు. అభినందనలు తెలిపారు.
అది రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ వారి ఉత్తరం. గ్రూప్‌ పరీక్షల్లో ఎంపికైనట్లు అందులో ఉంది.
‘రాష్ట్ర రవాణాశాఖలో రీజినల్‌ ట్రాన్స్పోర్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం. ఆదాయం, అధికారం, సంఘ గౌరవం ఉన్న కొలువు. నువ్వు రీసెర్చ్‌ పూర్తిచేసి పి.హెచ్‌.డి అవార్డు అయినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల రిక్రూట్‌ మెంట్‌ జరగడమే లేదు. సర్కారు సొమ్ము తినే అదష్టం అందరికీ రాదు. కళ్ళకద్దుకుని చేరిపో’ అని మిత్రులు సలహా ఇచ్చారు.
‘నాకు తెలుగంటే ఇష్టం. రీసెర్చ్‌ పూర్తి అయ్యాక ఈ ఉద్యోగం వచ్చి ఉంటే బాగుండేది’ బాధగా అన్నాడు.
‘అంత బాధ పడాల్సిన పనిలేదు. ఉద్యోగం చేస్తూ కూడా రీసెర్చ్‌ పూర్తి చేయవచ్చు. బంగారం లాంటి అవకాశం వదులుకోవద్దు’ అని చెప్పి సాగనంపారు.
మంచిరోజు, శుభలగం చూసి ఆర్టీవోగా ఉద్యోగంలో చేరాడు.
‘ఎక్కడికి పోయినా వి.ఐ.పి. ట్రీట్మెంట్‌, వద్దన్నా డబ్బు. ప్రతి నమస్కారాలు చేసిచేసి చెయ్యి నొప్పి పెట్ట్టే కొత్త కొలువు’. సంతోషమే సగం బలం అన్నట్లుగా నాలుగు కేజీల బరువు కూడా పెరిగాడు ప్రదీప్‌.
పెళ్లి, పిల్లలు… ఇలా నాలుగేళ్ళు గడిచాయి. రీసెర్చ్‌ వర్క్‌ అటకెక్కింది. తనతో కలిసి రీసెర్చ్‌ చేస్తున్న స్కాలర్‌ మిత్రులు రెండుమూడుసార్లు థీసిస్‌ విషయం మాట్లాడాలని ఫోన్‌ చేశారు. తను ఆ విషయంలో వెనుకబడి ఉండటంతో ముఖం చెల్లక ఫోన్‌ తీయలేదు. రోజులు గడిచేకొద్దీ వారు కూడా ఫోన్‌ చేయడం మానుకున్నారు.
ఉండబట్టలేని తెలుగు ప్రొఫెసర్‌, గైడ్‌ మేడం అడపాదడపా ఫోన్‌ చేస్తే ‘ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా’ అంటూ కాలం గడపసాగాడు. ఓపిక నశించి గైడ్‌ కూడా అడగటం మానుకుంది.

ఓ పౌర్ణమి రాత్రి-
ఉద్యోగ నిర్వహణలో భాగంగా తన అధికార పరిధిలోని ఊర్లన్నీ పర్యటిస్తున్నాడు. అదే సమయంలో ఆంధ్ర తమిళనాడు సరిహద్దు రవాణా శాఖ చెక్‌ పోస్ట్‌కు వెళ్ళాడు ప్రదీప్‌. బ్రేక్‌ ఇన్స్‌పెక్టర్‌లతో కలిసి దారిన వెళ్తున్న వాహనాలను ప్రక్కన పెట్టించి క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తున్నాడు.
అప్పుడే ఒక తమిళనాడు లారీ పూర్తి లోడ్‌తో వచ్చింది. దాని డాక్యుమెంట్లు సక్రమంగా లేవు. జరిమానా కట్టమని రశీదు రాశారు. రశీదు రాసాక డబ్బు కట్టనని మొండికేశాడు డ్రైవర్‌.
సిబ్బందికి, డ్రైవర్‌కి వాదోపవాదాలు మొదలయ్యాయి. ఆ గొడవ ప్రదీప్‌ దాకా వచ్చింది. సమస్య ఏమిటని సిబ్బందిని అడిగాడు.
‘రశీదు ఇంగ్లీషులో ఉంది. ఆ రశీదు పైన కానీ, రశీదు వెనుక కానీ ఎందుకు జరిమానా కట్టాల్సివచ్చిందో తమిళంలో రాయమని అడుగుతున్నాడు. అలా రాస్తేనే డబ్బు చెల్లిస్తానని మొండిపట్టు పట్టాడు. అదెలా సాధ్యమని మేము అంటున్నాము. భాష వేరైనా భావమొక్కటే కదా అని సర్ది చెప్పినా వినడం లేదు’ అని బదులిచ్చారు.
డ్రైవర్‌ ని ఎగాదిగా చూశాడు ప్రదీప్‌. రూపం చూస్తే డిగ్రీ దాకా చదువుకున్నట్లు కనిపించాడు.
‘డ్రైవర్‌కి ఇంగ్లీషు రాక కాదు, తన తమిళ భాష గొప్పదనాన్ని ప్రక్కవారికి తెలియజేయాలని’ ఇలా చేస్తున్నాడనిపించింది.
తమిళ డ్రైవర్‌కి తన భాష పట్ల ఉన్న అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ప్రదీప్‌.
అప్పుడే వచ్చిన కారులో ఉన్న ప్రయాణీకులు తమిళులే కావడంతో వారితో మాట్లాడి రశీదు మీద మొత్తం వివరాన్ని తమిళంలో రాయించాడు.
జరిమానా చెల్లించి, ఆర్టీవో ప్రదీప్‌కి సలాం చేసి ‘రురు’ మని లారీని ముందుకు నడిపాడు డ్రైవర్‌. తనకి తెలియకనే ప్రదీప్‌ చేయి ‘టాటా’ చెప్పింది.
‘ఈ తమిళులకు భాష పట్ల ఉన్న అభిమానంలో సగం మన తెలుగు వారికి ఉంటే తియ్యటి తెలుగు భాష మరింత పరిమళిస్తుంది కదా’ అనుకుంటూ ఆకాశంలోకి చూశాడు.
పాలబంతిలాంటి చందమామ ‘తమిళుల భాషాభిమానం సరే. నీ భాషాభిమానాన్ని కప్ప మింగేసిందా? నీ పి.హెచ్‌.డి ఇంకా పూర్తి చేయనే లేదు’ అన్నట్లుగా ప్రశ్నించి, అలిగినట్లు మబ్బుల చాటుకు వెళ్ళింది.
వెంటనే సెల్‌ అందుకున్నాడు ప్రదీప్‌, తన గైడ్‌ మేడంకి ఫోన్‌ చేయడానికి. ‘త్వరలోనే వచ్చి కలుస్తానని, రీసెర్చ్‌ వర్క్‌ పూర్తి చేస్తాననీ’ కంచు కంఠంతో చెప్పాడు.
మబ్బులు ప్రక్కకి వెళ్లిపోవడంతో, చందమామ ముసిముసినవ్వులు నవ్వుతూ ఆకాశంలోకి వచ్చాడు.
– ఆర్‌.సి.కష్ణస్వామి రాజు,
9393662821

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -