నవతెలంగాణ – హైదరాబాద్ : అల్పపీడన ఉద్ధృతికి బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారడంతో విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల 1న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వీరంతా ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వీరిని ఫోన్ ద్వారా సంప్రదించగా.. శనివారం మధ్యాహ్నానికల్లా తీరానికి చేరుకుంటామని చెప్పారు. అయితే, సాయంత్రం దాటినా బోటు హార్బర్కు చేరుకోకపోవడంతో తీరంలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వీరి ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
వేటకు వెళ్లిన బోటులో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడుతో పాటు భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఉన్నారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.



