నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ సీటుకు జరిగే ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తానని కిశోర్ వెల్లడించారు. ఈ ఎన్నిక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రిఫరెండం వంటిదని, అక్కడున్న 4 లక్షల ఓటర్లు మార్పు కోరుతూ తనకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ప్రశాంత్ కిశోర్ పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ …. 2006 నుంచి బంకీపూర్ నుంచి ఎన్నికవుతున్న నితిన్ నబీన్ ఈ ఏడాది ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నికవడంతో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేశారని తెలిపారు.
ఈ నెల 30వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుందని, తనకు మద్దతివ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు బీజేపీ ని కోరుతానన్నారు. తాము పోటీ చేస్తామని ఆర్జేడీ ప్రకటించిందన్నారు. బీహార్ రాజకీయాల్లో బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ, జన్ సూరజ్ పార్టీలకు ప్రతిష్టాత్మక పోరుగా మారింది. బీజేపీకి కంచుకోటగా భావించే ఈ స్థానానికి జూలై 30న పోలింగ్ జరగనుంది. ఆగష్టు 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది.



