Wednesday, March 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమే 11 నుంచి జనగణన

మే 11 నుంచి జనగణన

- Advertisement -

పొరపాట్లకు తావులేకుండా నిర్వహించండి : కలెక్టర్లకు సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మే 11 నుంచి ”2027 జనగణన” మొదటి దశ ప్రారంభమవుతుందనీ, పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ సెన్సెస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ భారతి హోళికేరితో కలిసి ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాబోయే గణన ఎన్యూమరేషన్‌ ప్రక్రియ విధివిధానాలను వారికి సీఎస్‌ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్‌ డేటాను మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా సేకరిస్తారని చెప్పారు. ఇండ్ల గుర్తింపు
ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకతతో చేపట్టాలని సూచించారు. జనాభా గణనలో పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో స్వచ్ఛందంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఇల్లు, నివాసం, మారుమూల నివాసం, కుగ్రామం పట్టణ మురికివాడల గణన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. సమయపాలనకు కట్టుబడి ఉండటం, డేటా నాణ్యత ప్రమాణాల నిర్వహణ, కార్యకలాపాల్లో పారదర్శకత, గణన ప్రక్రియ యొక్క ప్రతి దశలో సజావుగా జరగాలని ఆదేశించారు.

మారుమూల ప్రాంతాల్లో గణనకు సంబంధించి ఎన్యూమరేటర్లకు రవాణా, ఇతర సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు నిర్మాణాత్మక శిక్షణ నమూనాను భారతి హోళీకేరీ ఈ సందర్భంగా వివరించారు. సురక్షితమైన డేటా సేకరణ, మొబైల్‌ ఆధారిత అప్లికేషన్లు, బ్యాకెండ్‌ పర్యవేక్షణ విధానాలతో సహా అధునాతన డిజిటల్‌ వ్యవస్థల పని తీరును ఆమె వివరించారు. ఎన్యూమరేషన్‌ బ్లాక్‌ల ఖరారు, అధికార పరిధి సరిహద్దుల ధృవీకరణను సులభతరం చేయడానికి స్థానిక అధికారులతో సమన్వయంపై ఆమె కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌ రంజన్‌, జీఏడీ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -