నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చేర్యాల తహసీల్దార్గా విధి నిర్వహణలో ఉన్న కొర్రా దిలీప్ నాయక్, రూ.70,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, నాగపురి గ్రామంలోని పలు సర్వే నంబర్లకు సంబంధించి 11 నాలా (వ్యవసాయేతర భూమి మార్పిడి) దరఖాస్తుల ప్రాసెసింగ్ కోసం ఫిర్యాదుదారుడి నుంచి తహసీల్దార్ ఈ లంచం డిమాండ్ చేశారు.
జమున కనకమ్మ మరియు ఇతరుల పేర్లపై ఉన్న 30 గుంటల భూమికి సంబంధించిన పనుల నిమిత్తం ఆయన ఈ మొత్తాన్ని తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం చేర్యాలలోని తన కార్యాలయంలోనే దిలీప్ నాయక్ లంచం తీసుకుంటుండగా, పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దిలీప్ నాయక్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్లోని ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.



