Sunday, June 1, 2025
E-PAPER
Homeమానవితోలుబొమ్మలాట ఓ సాధనంగా..

తోలుబొమ్మలాట ఓ సాధనంగా..

- Advertisement -

దృషనా కలిత… అంతరించి పోతున్న తోలుబొమ్మలాటకు తిరిగి జీవం పోస్తున్నారు. తన బృందంతో కలిసి సాంప్రదాయ పప్పెట్‌ షోకు చిరునామా అయిన అస్సాంలో తిరిగి ఆ కళను పునరుజ్జీవింపజేస్తున్నారు. అంతే కాదు ఈ కళనే సామాజిక మార్పు కోసం శక్తిగా మలుస్తున్నారు. తమ తోలుబొమ్మల ప్రదర్శనలతో సామాజిక సమస్యలు, సవాళ్లతో కూడిన సమాచారాన్ని, వాటి పరిష్కారాలను ప్రజలకు అందిస్తున్నారు..

గౌహతికి దగ్గరలో ఉన్న చిన్న పట్టణం హజోలో పెరిగారు దృషనా కలిత. తమ మతపరమైన పండుగల సమయంలో ప్రదర్శించబడే పుటోలా నాస్‌ అని పిలువబడే తోలుబొమ్మల ప్రదర్శన అంటే ఆమెకు అమితమైన ఆసక్తి. అస్సాంలో తోలుబొమ్మలాట సాంప్రదాయకంగా పురుషాధిక్యతలో ఉంది. సాధారణంగా ఇది తండ్రి నుండి కొడుకుకు సంక్రమిస్తుంది. ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టి ఈ కళను తన సొంతం చేసుకోవాలని నిశ్చయించుకుంది.
నన్ను ఆపలేకపోయారు
‘మొదట్లో నేర్చుకోవడం కష్టంగా ఉండేది. కానీ ప్రతి విషయాన్ని గమనించకుండా, కళాకారుల నుండి నేర్చుకోకుండా నన్ను ఎవ్వరూ ఆపలేకపోయారు’ అంటూ ఆమె ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. నేర్చుకోవాలనే పట్టుదల, నిబద్ధత కలిగిన కలిత ఆరేండ్లు వచ్చేసరికి అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలను చదవగలిగేది. ఆమె తండ్రి పుస్తకాలు బాగా చదివేవారు. వారి ఇల్లు పుస్తకాల సంపద అని చెప్పుకోవచ్చు. చిన్నతనంలోనే కలిత ప్రేమ్‌చంద్‌, ఠాగూర్‌, చార్లెస్‌ డికెన్స్‌, అస్సామీ జానపద కథల వంటి ప్రసిద్ధ సంకలనం బుహి ఐ హడు రచనలను బాగా చదివారు. గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, మాస్‌ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన తర్వాత ఆమె కార్పొరేట్‌ ఉద్యోగం కోసం ఢిల్లీ చేరారు. ‘చేస్తున్న పనిలో నాకు ఎలాంటి సంతృప్తి కనిపించలేదు. ఎప్పటికీ ఈ కార్పొరేట్‌ సెటప్‌లో ఉండాలని లేదు. అస్సాం కోసం ఏదైనా చేయాలనుకున్నాను. సంతృప్తి లేని పని చేయడం చాలా బాధగా అనిపించింది’ అని ఆమె చెప్పారు.
సామాజిక మార్పుకై…
2013లో ఆమె గౌహతికి తిరిగి వచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన తోలుబొమ్మలాట ఔత్సాహికులతో పప్పెట్‌ పీపుల్‌ను ప్రారంభించింది. అయితే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆమె నిర్ణయాన్ని వింతగా భావించారు. ‘చక్కటి ఉద్యోగాన్ని వదిలి అస్సాంలో పుటోలా నాస్‌ గ్రూప్‌ను ఎందుకు ప్రారంభించింది’ అనే ప్రశ్న చాలా మందిలో మొదలయింది. అది ఏవిధంగా చూసినా వారికి మంచి కెరీర్‌గా అనిపించలేదు. ఇలా విమర్శకుల ప్రభావానికి గురౌతూనే కలిత, పుతోలా నాస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తన చిన్ననాటి కలను సాకారం చేసుకోవడానికి కృషి ప్రారంభించారు. సాంప్రదాయ కళారూపాన్ని ప్రచారం చేయడంతోనే ఆగిపోవాలనుకోలేదు. లింగ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడానికి దాన్ని ఓ మాధ్యమంగా ఉపయోగించడమే ఆమె లక్ష్యం.
హింసపై అవగాహన…
సామాజిక పరివర్తన అవసరాన్ని గుర్తించారు. మహిళలపై హింస చాలా సాధారణమైన సమాజంలో పెరిగిన కలిత సొంత అనుభవాలు, గాయాలు ఆమె సంకల్పాన్ని బలపరిచాయి. ఇతరులకు అవగాహన కల్పించడం, నిశ్శబ్దాన్ని ఛేదించడం తన బాధ్యతగా భావించారు. అలాగే తల్లిదండ్రులు చర్యలు తమ పిల్లలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకున్నారు. అస్సామీ జానపద కథలలో పిల్లల కథలో తరచుగా హింస కనిపిస్తుంది. ముఖ్యంగా బాలికల తల నరికివేయబడిన దృశ్యాలు ఉంటాయి. ఇది సాంప్రదాయంగా అందరి మనసుల్లో నాటుకుపోతుందని ఆమె నమ్ముతున్నారు. ‘వేధింపు, బలవంతపు వివాహాలు కూడా కథల్లో కనిపిస్తాయి. తరతరాలుగా ఇవే చెప్పబడతాయి. ఈ హింస సాధారణమైనది, ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇది మన ఆలోచన ప్రక్రియను ప్రభావితం చేస్తుంది’ అని ఆమె వివరిస్తున్నారు. లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకు కలిత జానపద కథలలో కొన్నింటిని తిరిగి రాస్తూ తోలుబొమ్మ ప్రదర్శనలలో చేర్చడం ప్రారంభించారు. మహిళల నుండి ఆమెకు మంచి మద్దతు వచ్చింది. మరిన్ని గ్రామాలు ఆమె బృందాన్ని ప్రదర్శనకు ఆహ్వానించడం ప్రారంభించాయి.
సమాజంతో అనుసంధానం
అతి తక్కువ కాలంలోనే కలిత సృజనాత్మక తోలుబొమ్మలాటతో మారుమూల గ్రామాల వరకు చేరుకున్నారు. వేధింపు, అక్రమ రవాణా, మద్యపానం, మాదకద్రవ్య దుర్వినియోగం, ఋతు ఆరోగ్యం, మంత్రగత్తె వేటల గురించి సమాచారం, అవగాహన కల్పిస్తూ గ్రామ గ్రామాలకు తిరగడం ప్రారంభించారు. మొదట కలిత తన బృందం ప్రదర్శన ఇచ్చే గ్రామ స్థానికులను కలిసి వారి సవాళ్లు, ఆందోళనలను అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత తన కథను వారి సమస్యలకు కనెక్ట్‌ అయ్యేలా రూపొందిస్తారు.
థియేటర్‌ గ్రూపుతో…
ఈ బృందం మొదటిసారిగా టీ తెగల భాష అయిన సద్రిలో ప్రదర్శన ఇచ్చింది. మహిళలను కన్నీళ్లతో ముంచెత్తింది. ‘టీ తోటలలో ఇది పూర్తిగా భిన్నమైన ప్రపంచం. మహిళలకు చాలా తక్కువ జీతం ఇస్తారు. బాత్రూమ్‌లు ఉండవు. పొలాల్లోనే విశ్రాంతి తీసుకోవాలి. అంతకు మించి గృహ హింస భయంతో నిత్యం జీవిస్తున్నారు. ‘మేము 10 నుండి 12 టీ తోటలలో ప్రదర్శన ఇచ్చాము. మహిళలు తీవ్రంగా కదిలిపోయారు. ఇంతకు ముందు ఎవరూ తమ సమస్యలపై దృష్టి పెట్టలేదని వారు నాకు చెప్పారు’ అని ఆమె వివరించారు. మహిళల సమస్యలు తెలుసుకునేందుకు పురుషులను ఈ ప్రచారాలలో పాల్గొనేలా చేయడం ముఖ్యం అని ఆమె భావించారు. పప్పెట్‌ పీపుల్‌తో పాటు, కలిత వీధి నాటకాలు, స్కిట్‌లు ప్రదర్శన, జానపద సంగీతాన్ని ఉపయోగించి ప్రజల్లో అవగాహన పెంచే ఒక థియేటర్‌ గ్రూపును కూడా నడుపుతున్నారు. ఈ కళారూపాన్ని నేర్చుకోవడంలో ఆసక్తి ఉన్న యువత కోసం ఆమె వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నారు. పప్పెట్‌ పీపుల్‌ న్యూ ఏజ్‌ యాక్టర్స్‌ థియేటర్‌ ఫౌండేషన్‌ యూనిట్‌గా నమోదు చేశారు. దీని ఆధ్వరంలో ప్రదర్శనలు, శిక్షణ వర్క్‌షాప్‌లు ఉచితంగా నిర్వహిస్తున్నారు.
విరాళాలతో…
‘ప్రదర్శనల కోసం అస్సాం అంతటా ప్రయాణించడం కష్టం. చాలా కాలం నేను చేసిన ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బుతో నేను దీనికి నిధులు సమకూర్చాను’ అని ఆమె పంచుకున్నారు. ఇటీవల ఈ సంస్థ జుబాన్‌ ఫెలోషిప్‌తో పాటు మరొక గ్రాంట్‌ను గెలుచుకుంది. గతంలో తన కార్యాలయాన్ని ఆమె ఇంటి నుండే నడిపించేది. ఈ వచ్చిన డబ్బుతో ప్రత్యేకమైన చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా అభిమానులు, శ్రేయోభిలాషుల నుండి విరాళాలు కూడా జట్టును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతున్నాయి.
కథ చెప్పడం ద్వారా…
‘పిల్లలు చాలా ప్రశ్నలు అడుగుతారు. కొన్నిసార్లు మేము తోలుబొమ్మలను ఎలా మారుస్తామో చూడటానికి వేదిక వెనుక్కు కూడా వస్తారు. గతంలో ఋతుస్రావం సమయంలో బాలికలు, స్త్రీలను మూడు రోజుల పాటు బలవంతంగా వేరుగా కూర్చోబెట్టేవారు. స్నానం చేయడానికి, పాఠశాలకు వెళ్లడానికి వారికి అనుమతి ఉండేది కాదు. మా ప్రదర్శనల తర్వాత ఇందులో కొంత మార్పు వచ్చింది. ఆ సమయంలో అమ్మాయిలు పాఠశాలకు వెళ్లడంతో కొంత మార్పు వచ్చిందని మేము నమ్ముతున్నాము’ అని ఆమె చెప్పారు. కథ ఒక శక్తివంతమైన సందేశాన్ని కలిగి ఉంది. ఇది ఇంట్లో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి, విద్యపై దృష్టి పెట్టడానికి బాలికలను ప్రేరేపిస్తుంది. నిరంతర సంఘర్షణలు తమ పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో తల్లిదండ్రులు ఆలోచించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఏడాదికి 50కి పైగా…
ప్రతి ప్రదర్శన కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఉంటుంది. కథ చెప్పడం హాస్యం, నాటకం, భావోద్వేగాలతో నిండి ఉంటుంది. తద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టంతో పాటు ఇతర చట్టాల గురించి సమస్యలను లేవనెత్తే టింగ్‌టాంగ్‌ అనే విదూషకుడి పాత్ర ఉంది. అతను ఫన్నీగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తాడు’ అని కలిత చెప్పారు. బృందం ఏడాదికి 50కి పైగా ప్రదర్శనలు ఇస్తుంది. ప్రతిదానికీ 500 మందికి పైగా ప్రేక్షకులు హాజరవుతారు. సాంప్రదాయ తీగ, రాడ్‌ తోలుబొమ్మలతో సహా వివిధ రకాల తోలుబొమ్మలను, సొంతంగా రూపొందించిన తోలుబొమ్మలను ఉపయోగిస్తారు. ‘ఇప్పటికీ అనేక గొప్ప ప్రదర్శనలు ఇచ్చాము. ఇదంతా నిజమేనా, ఒకవేళ నేను భ్రమలో ఉన్నాన అనుకుంటున్నాను’ అంటూ ఆమె నవ్వుకున్నారు.
లోతైన సమస్యలపై…
సాంప్రదాయ కళారూపాన్ని అస్సాం దాటి తీసుకెళ్లాలని, దాని కళాకారులు గుర్తింపు పొందేలా చూసుకోవాలని ఆమె నిశ్చయించుకున్నారు. ‘పుటోలా నాస్‌ ఒకప్పుడు విస్తృతంగా ప్రేమించబడింది కానీ డిజిటల్‌ యుగంలో దాని ప్రకాశాన్ని కోల్పోయింది. అయినప్పటికీ ప్రజలు మా ప్రదర్శనలను ఎంతగా ఆస్వాదిస్తున్నారో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సామాజిక మార్పు కోసం నేను దీన్ని ఒక సాధనంగా ఉపయోగించాలనుకుంటున్నాను. లోతైన సమస్యలపై కథలు రాయాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉందని భావిస్తున్నాను’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -