– ఎల్బీనగర్ చౌరస్తా నుంచి ప్రజాభవన్ వరకు కదిలిన ఎర్రదండు
– హోరెత్తిన పేద, మధ్యతరగతి ప్రజల నినాదాలు
– ప్రారంభంలోనే అడ్డుకున్న పోలీసులు.. చౌరస్తా వద్ద ఉద్రిక్తం
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ఇతర నేతల అరెస్ట్
– ధర్నా వేదికగా మారిన పోలీస్స్టేషన్
– ఇండ్లు ఇవ్వకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం : జాన్వెస్లీ హెచ్చరిక
పేద, మధ్యతరగతి ప్రజానీకానికి ఇండ్ల స్థలాల కోసం సోమవారం హైదరాబాద్లో సీపీఐ(ఎం) మహాపాదయాత్ర నిర్వహించింది. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తా నుంచి ప్రజాభవన్ వరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆధ్వర్యంలో నేతలు, పేదలు, మహిళలు పెద్దఎత్తున ర్యాలీగా కదిలారు. ఎర్ర జెండాలు చేతబూని ఇండ్లు ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సమయంలో వారందరినీ ముందుకు పోనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అరుపులు, నినాదాలతో ఎల్బీనగర్ చౌరస్తా హోరెత్తింది. జాన్వెస్లీ సహా ముఖ్య నేతలను అరెస్టు చేసి ఎల్బీనగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. అరెస్టుల విషయం తెలిసి భారీఎత్తున పేదలు, మహిళలు పోలీసు స్టేషన్కు తరలివెళ్లారు. ఆ స్థలాన్ని ధర్నా వేదికగా చేసుకుని నేతలు మాట్లాడారు. పేదలకు ఇండ్లు ఇవ్వకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని జాన్వెస్లీ హెచ్చరించారు.

నవతెలంగాణ – దిల్సుఖ్నగర్
ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే సీఎం రేవంత్రెడ్డిని కూడా కేసీఆర్ మాదిరిగా ఇంటికి పంపిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్నగర్, నాగోల్ సర్కిల్ కమిటీల ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నుంచి ప్రజాభవన్ వరకు పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్ను అధికారంలో ఉండగా అడిగితే అరెస్టులు చేశారని గుర్తు చేశారు. ఈ కారణంగానే కేసీఆర్ను కమ్యూనిస్టులు ఇంటికే పరిమితం చేశారన్నారు. నాటి కమ్యునిస్టు పోరాటాలకు నేటి సీఎం రేవంత్రెడ్డి పలుమార్లు మద్దతు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చి నేడు ఆరు గ్యారంటీలు అడిగితే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్నదన్నారు. కేసీఆర్ కార్పొరేట్లకు ధారాదత్తం చేసిన ప్రభుత్వ భూములను తిరిగి పేదలకు పంపిణీ చేస్తానని చెప్పిన విషయం ఏమైందని సీఎంను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని నేటికీ వాటిపై విచారణ లేదని అన్నారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చంద్రమోహన్ సమన్వయకర్తగా వ్యవహరించారు.

పోలీస్స్టేషన్ ఎదుట మహిళల ధర్నా
పాదయాత్ర నాయకుల అరెస్టుల విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలు, మహిళలు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు. దాంతో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ నాయకులతో చర్చలు జరిపారు. శాంతి భద్రతల కారణంగా పాదయాత్రను అడ్డుకున్నామని పోలీసులు వివరించారు. అనంతరం పీఎస్ ముందు బైటాయించిన మహిళలనుద్దేశించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ.. అరెస్టులు, జైళ్లు కమ్యూనిస్టులకు కొత్త కాదని, ఇండ్లు, ఇండ్ల స్థలాలు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర కార్యదర్శితోపాటు నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పేదలకు కమ్యూనిస్టులు పంచిపెట్టిన ప్రభుత్వ భూములను నేడు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటున్నదని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.సామెల్, డి.రామచందర్, డి.జగదీష్, కె.జగన్, జి.కవిత, ఈ.నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు ఆలంపల్లి నరసింహ, పి.అంజయ్య, గోరెంకల నరసింహ, పి.జగన్, రావుల జంగయ్య, ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఏ.ఎల్లయ్య, హయత్నగర్ సర్కిల్ కార్యదర్శి కీసరి నర్సిరెడ్డి, సరూర్నగర్ సర్కిల్ కార్యదర్శి సిహెచ్.వెంకన్న, నాయకులు ఎం.వీరయ్య కె.గణేష్, కె.శ్రీనివాస్, సంధ్య, రామస్వామి, నరహరి, కృష్ణయ్య, కనకయ్య, గోపి నాయక్, పోలే రమేష్, వెంకటేష్, లతీఫ్, కాశయ్య, రాధమ్మ, లక్ష్మణ్, గంగమ్మ, సుజాత, వెంకటమ్మ, పద్మమ్మ, లలిత పాల్గొన్నారు.

రణరంగంగా మారిన ఎల్బీనగర్ చౌరస్తా
సీపీఐ(ఎం) తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నేతలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా పార్టీ శ్రేణులు ముఖ్యంగా మహిళలు ప్రతిఘటించారు. అయితే రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యులు చంద్రమోహన్ తదితరులను పోలీసులు అదుపులో తీసుకోవడంతో చౌరస్తాలో ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని పోలీసులకు ఎంత సర్ది చెప్పినా వినిపించుకోలేదు. నాయకులను ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.




