ప్రభుత్వ పాఠశాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
సర్పంచ్ శ్రీశైలం యాదవ్
నవతెలంగాణ – మిడ్జిల్
ప్రభుత్వ పాఠశాల బలోపేతమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని సర్పంచ్ గోదా శ్రీశైలం యాదవ్ చెప్పారు. మంగళవారం మండలంలోని మసిగుండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని పేర్కొన్నారు.
అధ్యాపకులు చెప్పే పాఠాలను ప్రతి విద్యార్థి కూడా శ్రద్ధగా వినాలని చెప్పారు. ఒక్కరోజు ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉందో తోటి విద్యార్థులకు అర్ధమైందని , భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఎదగాలని సూచించారు. విద్యార్థులే ఉపాధ్యాయులే తోటి విద్యార్థులకు విద్యను బోధించారు. 15 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా తమ విధులు నిర్వహించారు. జిల్లా విద్యాధికారిగా వైష్ణవి, సౌమ్య, మండల విద్యాధికారిగా అక్షర, ప్రధానోపాధ్యాయులుగా నవదీప్ విధులు నిర్వహించారు.
ఉత్తమ బోధన చేసిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి సరస్వతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ జనార్దన్, ఉపాధ్యాయులు రాజేష్, గ్రామ పెద్దలు వెంకటయ్య, మల్లేష్, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.



