కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్
షరతులు అంగీకరిస్తే చర్చలకు సిద్ధం : ట్రంప్
మధ్యప్రాచ్యంలో ఉధృతమైన పోరు
హార్ముజ్లో 16 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసిన అమెరికా
నవతెలంగాణ – సెంట్రల్ డెస్క్
మధ్యప్రాచ్యంలో ఫిబ్రవరి 28 తేదీన మొదలైన యుద్ధం బుధవారం 12వ రోజుకు చేరింది. అమెరికా-ఇజ్రాయిల్ సేనలు, ఇరాన్ దళాలు వైమానిక దాడులు కొనసాగించాయి. ప్రత్యర్థి స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయి. ఇరు పక్షాలు సైనిక చర్యలను తీవ్రతరం చేయడంతో అనేక ప్రాంతాలలో పేలుళ్లు సంభవించాయి. తమ జనావాసాలపై జరుగుతున్న దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. వాషింగ్టన్ షరతులకు అంగీకరిస్తే ఇరాన్తో చర్చలకు సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పేలుడు పదార్థాలను అమర్చినట్లు సమాచారమేమీ లేదని ఆయన చెప్పారు. ఒకవేళ హార్ముజ్ లో ఇరాన్ పేలుడు పదార్థాలను అమర్చితే వాటిని తక్షణమే తొలగిస్తామని తెలిపారు. కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాలను రవాణా చేసిన పడవలను ఎలా ధ్వంసం చేశామో హార్ముజ్లో కూడా అలాగే చేస్తామని బెదిరించారు.
చమురు రవాణాను అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హార్ముజ్ జలసంధి సమీపంలో ఆ దేశానికి చెందిన 16 నౌకలను ధ్వంసం చేశామని, ఇప్పటి వరకూ ఇరాన్ జరిపిన దాడులలో తమ సైనికులు 140 మంది గాయపడ్డారని అమెరికా తెలిపింది. అమెరికా, ఇజ్రాయిల్లకు చెందిన 104 డ్రోన్లను నేలకూల్చామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్లో ఒకే రోజు 400 లక్ష్యాలపై దాడి చేశామని అమెరికా చెప్పింది. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయి. ఇదిలా వుండగా టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో పలు క్షిపణులను ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఒకవేళ పోరు కొనసాగితే ఆరు నుంచి ఎనిమిది నెలల వరకూ సరిపడే క్షిపణులు తమ వద్ద నిల్వ ఉన్నాయని ఇరాన్ తెలిపింది. తాము కాల్పుల విరమణను కోరుకోవడం లేదని, శత్రువులను శిక్షించి తీరతామని ప్రకటించింది. ఇరాన్ యుద్ధం కోసం ప్రత్యేక బడ్జెట్ను రూపొందిస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు.
ఇరాన్- అమెరికా- ఇజ్రాయిల్ యుద్ధం దీర్ఘకాల ఘర్షణలకు దారితీయవచ్చునని నిపుణులు హెచ్చరించారు. ఇరాన్కు చెందిన ఓ బ్యాంకుపై దాడి జరిగిన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని అమెరికా, ఇజ్రాయిల్ బ్యాంకులపై దాడులు చేస్తానని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్లోని అలిగుడర్జ్ నగరంపై జరిగిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఇరాన్లోని ఓ డ్రోన్ యూనిట్పై దాడి చేశానని ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది. ఖతార్ రాజధాని దోహాలో పేలుడు శబ్దాలు వినిపించాయి. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’ పేరిట ప్రతీకార దాడులు మొదలు పెట్టామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తెలిపింది. అమెరికా, ఇజ్రాయిల్ కీలక స్థావరాలే లక్ష్యంగా దాడులను ఉధృతం చేసామని చెప్పింది.
మూడు గంటలపాటు నిరంతరాయంగా క్షిపణి దాడులు జరిగాయని వివరించింది. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళ స్థావరంపై, టెల్ అవీవ్లోని సైనిక కేంద్రాలపై దాడులు జరిపామని తెలియజేసింది. ఈ దాడుల్లో ఖెయిబర్ షేకన్, ఖద్ర్, ఖొరామ్షర్ క్షిపణులను ఉపయోగించారు. కాగా ఇజ్రాయిల్ దళాలు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నాయి. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలు, దక్షిణ లెబనాన్ ప్రాంతాలపై దాడులు జరిగాయి. సుమారు ఎనిమిది లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని లెబనాన్ అధికారులు చెప్పారు. ఇరాన్ సైన్యం బుధవారం పర్షియన్ గల్ఫ్లోని వాణిజ్య నౌకలపై దాడులు జరిపింది. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడి చేసింది. ఇరాన్కు చెందిన రెండు డ్రోన్లు దుబాయి విమానాశ్రయం సమీపంలో పడ్డాయి.



