నవతెలంగాణ-హైదరాబాద్: జులై 20 న సీజేపీ తలబెట్టబోయే శాంతియుత యాత్ర వరకూ తాను ఎట్టిపరిస్థితుల్లో ప్రాణాలతో ఉంటానని ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం ఆయన మాట్లాడారు. నీట్ లీకేజ్కు నిరసనగా జులై 20న పార్లమెంట్ వరకూ చేపట్టబోయే శాంతియుత యాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నీట్ లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో మరికొన్ని డిమాండ్లు కోరుతూ సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. గత 20 రోజులుగా సోనమ్ వాంగ్చుక్ కేవలం నీటి పైనే జీవిస్తున్నారని, ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ఆయనకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ సతీష్ లంబా హెచ్చరించారు.సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన శరీరంలోని కొవ్వు, కండరాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ఆయన ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గారు.
ఈ సమయంలో ఆయన సరదాగా మాట్లాడుతూ “నేను జూలై 20 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ మీరు రాకపోయినా, జూలై 20 మార్చ్ విజయవంతం కాకపోయినా, నేను దెయ్యంగానైనా తిరిగి వస్తాను” అని అనడంతో అక్కడ ఉన్న మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుండా దీక్షను విరమిస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని, అందుకే వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 20 పార్లమెంట్ మార్చ్ను విజయవంతం చేయడంపైనే ఉండాలని కోరారు.
ఢిల్లీ హైకోర్టు జోక్యం
ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తే తక్షణమే అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని కోర్టు స్పష్టం చేసింది.
NEET పేపర్ లీక్కు వ్యతిరేకంగా జూన్ 20 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఈ నిరసనలను ప్రారంభించగా, జూన్ 28న సోనమ్ వాంగ్చుక్ ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.



