Thursday, March 12, 2026
E-PAPER
Homeక్రైమ్కుళ్లిన మాంసం విక్రయాలు

కుళ్లిన మాంసం విక్రయాలు

- Advertisement -

– ఒకరి అరెస్ట్‌.. 300 కేజీల మాంసం వ్యర్థాల స్వాధీనం
– మంగళ్‌హాట్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ఆకస్మిక దాడి
నవతెలంగాణ-ధూల్‌ పేట్‌

హైదరాబాద్‌ మంగళహాట్‌ పరిధిలోని ఓ దుకాణంలో కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తుండగా పోలీసులు తనిఖీ చేసి ఒకరిని అరెస్టు చేశారు. సుమారు 300 కిలోల మాంసం వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం గోల్కొండ జోన్‌ అదనపు డీసీపీ బి.కృష్ణ గౌడ్‌ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళహాట్‌ ఆర్‌కే పేట్‌, చిస్టి చమన్‌ దర్గా సమీపంలో అమర్‌ నగర్‌ కాలనీ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అఫ్రోజ్‌ అలియాస్‌ అఫ్రోజ్‌ ఏ టు జెడ్‌ గోట్‌(మేక), అండ్‌ షిప్‌(గొర్రె) అఫ్ఫల్స్‌ అనే దుకాణం నిర్వహిస్తున్నాడు. కుళ్లిన మేకల, గొర్రెల మాంసం అమ్ముతున్నాడు. దీని పై విశ్వసనీయ సమాచారం మేరకు మంగళ్‌హాట్‌ పోలీసులు, గోల్కొండ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. తాజా మాంసం అని నమ్మిస్తూ, నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయించడాన్ని గుర్తించారు. గతంలో ఇలాంటి నేరానికి పాల్పడగా, అప్పట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు అతడికి జరిమానా విధించారు. కర్నాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే మాంసాన్ని సేకరించేవాడు. అలా సేకరించిన మాంసాన్ని డీప్‌ ఫ్రీజర్లలో, నీటితో నింపిన ప్లాస్టిక్‌ టబ్బులలో రోజుల తరబడి ఉంచేవాడు. మాంసం కుళ్లిపోకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇలా నిల్వ చేస్తూ, వినియోగదారులకు అది తాజా మాంసమని నమ్మించి విక్రయిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఫుడ్‌ అడల్టరేషన్‌ టీమ్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి సదరు ప్రాంతాన్ని తనిఖీ చేయగా, అపరిశుభ్రమైన పరిసరాల్లో నిల్వ ఉంచిన 300 కేజీల కుళ్లిన మాంసాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలు గమనించాలి..
అనధికారిక, అపరిశుభ్రమైన ప్రాంతాల నుంచి మాంసం, ఆహార పదార్థాలను కొనుగోలు చేయొద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడైనా మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఇలా అపరిశుభ్రమైన, కల్తీ ఆహార వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గోల్కొండ జోన్‌ డీసీపీ జి.చంద్ర మోహన్‌ పర్యవేక్షణలో కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కుల్సుంపుర ఏసీపీ, మంగళ్‌హాట్‌ ఎస్‌హెచ్‌ఓ ఎస్‌.రాఘవేంద్ర, ఎస్‌ఐలు వినోద్‌, శ్రుతి, సిబ్బంది పాల్గొన్నారు. వారిని డీసీపీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -