నవతెలంగాణ-హైదరాబాద్: విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. వాస్తవానికి ఉదయం 11.30 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసి.. శాస్త్రవేత్తలు పరిశీలనలు చేపట్టారు. ఇంధన ప్రక్రియలో సమస్య ఉన్నట్లు గుర్తించి దాన్ని సరిచేశారు. 35 నిమిషాల తర్వాత రాకెట్ను ప్రయోగించారు.
ఈ రాకెట్.. సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని మోదీ తన చేతిరాతతో ‘వందేమాతరం’ అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటితో పాటు కాస్మోస్ డైమండ్స్ సంస్థ రూపొందించిన ‘కాస్మిక్ బ్లూమ్’ ఆర్ట్వర్క్, విక్రమ్-1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్ని కూడా నింగిలోకి పంపారు. దీనిపై సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మరూపాలను చెక్కారు. అంతేగాక, ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ స్కైరూట్ బృంద సభ్యులు, ఇస్రో మాజీ ఛైర్మన్లు, శాస్త్రవేత్తలు, భారతీయ వ్యోమగాములు, ఇతరులు పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్కార్డులను సైతం ప్రత్యేక పేలోడ్ బాక్స్లో భద్రపరిచారు.



