జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భూగర్భ జలాలు పరిరక్షించడం వలన భవిష్యత్ తరాలకు తగినంత నీటి వనరులు అందుబాటులో ఉంటాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కేంద్రీయ భూగర్భ జల బోర్డు ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణపై ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కోసం నీటి ఎద్దడిని నివారించేందుకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. శాస్త్రవేత్తలు పరిశోధనలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఇంకుడు గుంతలు నీటి కుంటల ద్వారా భూగర్భ జలాలను పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ.. నీటి సంరక్షణ కార్యక్రమంలో 100 మంది గ్రామీణ ప్రాంతంలో పని చేసే వారికి కేంద్రీయ భూగర్భ జల శాఖ వారి అధ్యయనాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. సీజిడబ్ల్యూ రీజినల్ డైరెక్టర్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పద్ధతుల ద్వారా భూగర్భ జల సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరించారు. అనంతరం భూగర్భ జలమండలి ముద్రించిన నాక్విమ్ రిపోర్ట్, జిల్లా రీఛార్జ్ మ్యాప్ ను విడుదల చేశారు. భువనగిరి నీటి ఎద్దడిని నివారించేందుకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిజిడబ్ల్యూబి శాస్త్రవేత్త యాదయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, జె. ఏ. సి చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, సుధీర్ కుమార్, మాధవి, సరిత, రేష్మ పిల్లాయి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



