– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నష్టపోయిన విద్యార్థులకు తగిన ఆర్థిక పరిహారం ప్రకటించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అశ్వారావుపేటలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఆశలతో నీట్ పరీక్ష రాస్తే, కోచింగ్ మాఫియా – అధికార యంత్రాంగం కుమ్మక్కు కావడం వల్లే పేపర్ లీకేజీ జరిగిందని ఆరోపించారు. ఇది మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పరీక్షల నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని లేదా సమగ్రంగా ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఏసు, రామస్వామి, తిరుపతిరావు, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.



