– బయట నూనె తెచ్చి ప్యాకింగ్ చేస్తున్నారా..?
– అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు
– క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలపై సందేహాలు
నవతెలంగాణ – కామారెడ్డి
రోజు రోజుకు ప్రతి వస్తువు కల్తీ అవుతూనే ఉంది అందులో ప్రధానంగా వంట నూనెల కల్తీని ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కట్టడి చేయలేకపోతోంది. దీంతో వంట నూనెల కల్తీ ఇస్తా రీతిగా కొనసాగుతోంది. ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. కల్తీ వంటనూనెల వల్ల మనుషుల ఆరోగ్యం ఏ విధంగా చెడిపోతుందో అధికారులకు తెలిసిన పట్టనట్లు వ్యవహరిస్తుండడం పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుకాణాలలో జరిగే కల్తీ కాకుండా ఏకంగా ఇండస్ట్రీలోనే కల్తీ అవుతుందని ప్రచారం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా
మాచారెడ్డి మండలం భవానిపేట్ సమీపంలోని శ్రీ తులసి ఆయిల్ ఇండస్ట్రీస్ (Tasty Gold Oils)లో జరుగుతున్న నూనెల తయారీ విధానంపై స్థానికుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్యాక్టరీలో పూర్తిస్థాయి తయారీ జరుగుతోందా, లేక బయట నుంచి నూనె తెచ్చి శుద్ధి చేసి ప్యాకింగ్ మాత్రమే చేస్తున్నారా అనే అంశంపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానంగా ఉత్పన్నమవుతున్న పలు ప్రశ్నలు:
ఫ్యాక్టరీలో గింజల నుంచి నూనె తయారీ నిజంగా ఎంతమేర జరుగుతోంది ? , తరచూ వస్తున్న క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ల పాత్ర ఏమిటి ? స్థానిక రైతుల నుంచి ముడి సరుకు కొనుగోలు జరుగుతోందా లేదా ? పూర్తిస్థాయి తయారీ యూనిట్గా పనిచేస్తుందా, లేక రిఫైనింగ్ , ప్యాకింగ్ యూనిట్గా మాత్రమేనా?,
స్థానికులను అడిగి అభిప్రాయాలు తీసుకుంటే వారి అభిప్రాయాలు:
ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు రావడం గమనించబడుతోందని, దీంతో ఇక్కడ గింజల నుంచి నూనె తయారీ పరిమితంగానే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయనీ, అధికారికంగా ముడి సరుకులతో తయారీ జరుగుతుందని చెబుతున్నప్పటికీ, దీనిపై స్పష్టత అవసరమని ప్రజలు అంటున్నారు.
నాణ్యతపై సందేహాలు:
నూనె శుద్ధి ప్రక్రియ, నాణ్యత నియంత్రణ విధానాలు, వాడుతున్న ముడి సరుకుల మూలం వంటి అంశాలపై పారదర్శకత లోపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తయారవుతున్న నూనెలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయంపై అధికారిక ధృవీకరణ అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల జోక్యం అవసరం:
ఈ నేపథ్యంలో ఆహార భద్రత విభాగం (FSSAI), పౌర సరఫరా శాఖ, పరిశ్రమల విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అనుమానాలు పెరిగే అవకాశం
పరిశ్రమలో నిజంగా ఏ స్థాయిలో తయారీ జరుగుతోంది ? ముడి సరుకుల వినియోగం ఎంత ? అనే అంశాలపై స్పష్టత రాకపోతే, ఈ అనుమానాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.




