సాత్విక్, చిరాగ్ జోడికి ఐదో సీడ్
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత అగ్రశ్రేణి షట్లర్, జపాన్ ఓపెన్ విజేత పి.వి సింధుకు రానున్న బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్స్లో ఐదో సీడ్ లభించింది. 2022 ఆసియా గేమ్స్ చాంపియన్స్ సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడికి ఐదో సీడ్ దక్కింది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్కు 14వ సీడ్, మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టోలకు 15వ సీడ్ లభించింది. ఆగస్టు 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ జరుగనున్నాయి. ఆతిథ్య దేశంగా భారత్ నుంచి ప్రతి విభాగంలో ఇద్దరు పోటీపడనున్నారు. ఏప్రిల్ 28 ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారం షట్లర్లు టోర్నమెంట్కు అర్హత సాధించగా.. జులై 28 వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం మంగళవారం సీడింగ్ కేటాయించారు. మహిళల, పురుషుల సింగిల్స్తో పాటు పురుషుల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కనీసం ఓ భారత షట్లర్కు సీడింగ్ లభించింది.
ప్రపంచ చాంపియన్ షి యుకి (చైనా) పురుషుల సింగిల్స్లో టాప్ సీడ్గా నిలువగా.. దక్షిణ కొరియా అగ్రషట్లర్ అన్సె యంగ్కు నం.1 సీడింగ్ కేటాయించారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ చాంపియన్ అకానె యమగూచి (జపాన్) రెండో సీడ్గా బరిలోకి దిగనుండగా.. చైనా షట్లర్లు వాంగ్ జి యి, చెన్ యుఫెయ్లు వరుసగా 3, 4వ సీడింగ్ సాధించారు. ప్రపంచ చాంపియన్షిప్స్ డ్రా బుధవారం జరుగనుండగా.. ఈలోపు సీడింగ్ దక్కిన ఆటగాళ్లు ఎవరైనా పోటీ నుంచి తప్పుకుంటే సీడింగ్ ఆర్డర్ మారే అవకాశం ఉంది.



