నవతెలంగాణ – హైదరాబాద్ : యెమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో నౌక పూర్తిగా మునిగిపోయిందని, అయితే అందులోని 13 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 14 మంది సురక్షితంగా బయటపడ్డారని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. ‘ఎంఎస్వి ఫైజే నూరే ఓలియా’ అనే భారత జెండాతో ఉన్న నౌకపై ఆగస్టు 4న ప్రొజెక్టైల్ (క్షిపణి లాంటిది)తో దాడి జరిగింది. దీంతో నౌక బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. వెంటనే స్పందించిన యెమెన్ కోస్ట్ గార్డ్, సిబ్బంది అందరినీ రక్షించి సమీపంలోని మోఖా పోర్టుకు తరలించారు.
ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. “నిరాయుధులైన సిబ్బంది ఉన్న నౌకపై జరిగిన ఈ అకారణ దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. మన ప్రజల భద్రతే మాకు అత్యంత ముఖ్యం. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలియజేయడం ఊరటనిస్తోంది” అని మంత్రి సోనోవాల్ పేర్కొన్నారు. సిబ్బంది సంక్షేమం, భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.



