నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల టవర్స్’ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అర్హులైన పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7,680 ఎల్ఐజీ ఇళ్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 10 (సోమవారం) ఆఖరు తేదీ అని అధికారులు తెలిపారు. శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35,125 దరఖాస్తులు వచ్చినట్లు వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం కింద ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం రూ. 11 లక్షలు కాగా, ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీ అందిస్తోంది.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆగస్టు 30న కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. లాటరీలో ఎంపికైన వారికి ఏడాదిలోపు ఇళ్లను నిర్మించి అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. లాటరీలో ఇల్లు కేటాయించని దరఖాస్తుదారులు చెల్లించిన రూ. 10,000 డిపాజిట్ ఫీజును తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. ఆసక్తి కలిగిన అర్హులు మీసేవ కేంద్రాలు లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.



