బడి బాటతో విద్యార్థుల నమోదుపై ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ – కాటారం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటారం మండలం గంగారం లో విద్యార్థుల నమోదు పెంపు కోసం ముందస్తు “బడి బాట” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు ఎ . శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సదుపాయాల గురించి వివరించారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పించారు.
ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్య హక్కును సద్వినియోగం చేసుకోవాలని, గ్రామంలోని ప్రతి బాలబాలిక పాఠశాలలో చేరేలా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



