నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక రంగానికి జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఒక కొత్త ఊపునివ్వనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ స్మార్ట్ సిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 3,245 ఎకరాల భారీ విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ స్మార్ట్ సిటీ ద్వారా సుమారు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్లు సంయుక్తంగా నిర్వహించిన ‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్’ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి శ్రీధర్బాబు సచివాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నింటినీ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. EPC (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో జరుగుతున్న ఈ పనులను గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు.



