నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలను గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తన చీర లాగేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తన కాలికి కూడా గాయమైందని చెప్పారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు నల్ల షర్టులు, మహిళా నేతలు నల్ల చీరలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. అయితే వారికి ప్రవేశం లేదంటూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో నేతలు అక్కడే నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తన చీర లాగడం బాధ కలిగించిందని సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే బయట ఉన్న మహిళలకు వీళ్లు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. తన కాలికి గాయమైందని తెలిపారు.
తాము అసెంబ్లీకి వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న భయంతోనే అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.



