నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ మంటలు ఇంకా సజీవంగా ఉన్నాయి. అందుకు అమెరికా, ఇజ్రాయిల్ చర్యలు ఆజ్యంపోస్తున్నాయి. కాల్పుల విరమణ అంటూ రెండు దేశాలు దొంగనాటకాలు ఆడుతున్నాయి. పాక్ వేదికగా రెండో శాంతి చర్చలంటూ ట్రంప్ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. హర్మూజ్ ఆక్రమణే లక్ష్యంగా పలు రోజులనుంచి ఇరాన్ పోర్టులకు వచ్చే నౌకలకు యూఎస్ నౌకలు ఆటంకాలు సృష్టిస్తున్నాయి. దీంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని తెరచే ఉంచుతామని ప్రకటించిన మరుసటి రోజే.. మళ్లీ దానిని మూసివేస్తున్నట్లు ఇరాన్ (Iran) ప్రకటించింది. ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ పేర్కొంది.
మరోవైపు, దేశంలోని పలు ఎయిర్పోర్టులను తిరిగి తెరవడంతోపాటు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.



