మండపాల వద్ద డిజేలకు అనుమతి లేదు: సీఐ నాగరాజు
నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో ఈనెల 14 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నిర్వాకులు ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని, కరెంటు తీగలకు, అంతర్గత రహదారులో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని అచ్చంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం సిఐ నాగరాజు నవతెలంగాణతో మాట్లాడుతూ..మండపాల వద్ద నిర్వాకులు కాపలా ఉండాలని, అనుభవజ్ఞులైన ఎలక్ట్రిషన్ వారిచేత వైరింగ్ పనులు చేయించుకోవాలన్నారు. మండపాల వద్ద ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్తగా అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉన్న మండపాల వద్ద ముగ్గురు వాలంటీర్లు కాపలా ఉండాలని, అవసరం అనుకుంటే సిసి కెమెరా పర్యవేక్షణలో నిఘా ఉంచుకోవాలన్నారు.
అదేవిధంగా ఉత్సవాలలో భాగంగా మండపాల వద్ద ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే ముందస్తుగా పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించాలని, రాత్రి 11 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, టపాసులు పేల్చవద్దని, డిజే సౌండ్ సిస్టంలు ఏర్పాటుకు అనుమతులు లేవని సిఐ సూచించారు. బలవంతపు చందాలు చేస్తే… నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని సూచించారు.



