Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంకీలక రంగాలు కుదేలు

కీలక రంగాలు కుదేలు

- Advertisement -

– మార్చిలో 0.4 శాతానికి పతనం
– ఎరువుల ఉత్పత్తిలో క్షీణత
న్యూఢిల్లీ :
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే కీలక రంగాల ఉత్పత్తి మందగించింది. ప్రజల ఆదాయాలు హరించుకుపోవడంతో డిమాండ్‌ సన్నగిల్లింది. ఫలితంగా 2026 మార్చి నెలలో ఎనిమిది కీలక రంగాల సూచీ 0.4 శాతం క్షీణతను చవి చూసింది. ఇది 2024 ఆగస్టులోని 1.45 శాతం తర్వాత అత్యంత కనిష్ట స్థాయి. గతేడాది ఇదే మార్చిలోని 4.5 శాతం వృద్ధి రేటుతో పోల్చితే అత్యంత పేలవ ప్రదర్శన చోటు చేసుకోవడం ఆందోళకరం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40 శాతం వాటా కలిగి ఉండే బొగ్గు, ముడి చమురు, ఎరువులు, విద్యుత్‌, రిఫైనరీ, ఉక్కు, సహజ వాయువు, సిమెంట్‌ తదితర ఎనిమిది రంగాల్లో మందగమనం ఆర్థిక వ్యవస్థ బలహీనతను ఎత్తి చూపుతోంది. ఈ రంగాలు ఫిబ్రవరిలో 2.8 శాతం వృద్ధిని సాధించాయి. ఈ రంగాలు ఒక్కసారిగా తిరోగమనాన్ని చవి చూశాయి. అమెరికా యుద్ధోన్మాదంతో ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ప్రారంభమైన ఘర్షణల నేపథ్యంలో బొగ్గు, ముడి చమురు, ఎరువులు, విద్యుత్‌ రంగాల ఉత్పత్తిలో ఒత్తిడి నెలకొంది. అత్యధిక ప్రభావం ఎరువుల రంగంపై పడింది. ఫిబ్రవరిలో 3.4 శాతం వృద్ధిని కనబరిచిన ఈ రంగం మార్చిలో ఏకంగా మైనస్‌ 24.6 శాతం క్షీణించింది. ఈ సిరీస్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యంత అధ్వాన్నమైన పనితీరు. ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరాలో గల్ఫ్‌ దేశాలే ప్రధాన వనరు కావడంతో పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం ఉత్పత్తిపై తీవ్రంగా పడింది. మార్చిలో బొగ్గు ఉత్పత్తి 4 శాతం క్షీణించగా, ముడి చమురు ఉత్పత్తి 5.7 శాతానికి పడిపోయింది. విద్యుత్‌ ఉత్పత్తి కూడా ఫిబ్రవరిలో 2.3 శాతం వృద్ధి నుంచి మార్చిలో 0.5 శాతానికి క్షీణించింది. ఉక్కు ఉత్పత్తి 2.2 శాతం పెరగడం సానుకూలాంశం. దిగుమతులు తగ్గడంతో ప్రభుత్వం సామర్థ్యాన్ని 40 శాతం మేర పెంచిన కారణంగా సహజ వాయువు ఉత్పత్తి 6.4 శాతం పెరిగింది. రిఫైనరీ ఉత్పత్తులు 0.07 శాతంతో స్థిరంగా ఉండగా, సిమెంట్‌ రంగం 4 శాతం వృద్ధితో సరిపెట్టుకుంది. ఫిబ్రవరిలోని 8.9 శాతం పెరుగుదలతో పోలిస్తే నిర్మాణ రంగ కార్యకలాపాల్లో వేగం తగ్గింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు దేశీయ ఉత్పత్తిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతిమంగా భారత జీడీపీని దెబ్బతీయనున్నాయని.. మున్ముందు మరిన్ని సవాళ్లకు సంకేతంగా మారుతోందని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -