నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తనపై అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దానిపై ఆలోచించాల్సి ఉందన్నారు.
రాజకీయాల్లో పోరాటాలు తనకు కొత్త కాదని, తాను యుద్ధం చేసే ఈ స్థాయికి వచ్చానని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. రాబోయే ఉపఎన్నికలను పూర్తిగా స్వాగతిస్తున్నామని, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం, కొట్లాడటం తనకు అలవాటేనని, మళ్లీ పోరాడి కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాజకీయ యుద్ధంలో చివరికి తామే విజయం సాధిస్తామని, ఉప ఎన్నికల్లో పోటీకి సంపూర్ణంగా సిద్ధమవుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ఉపఎన్నిక యుద్ధంలో విజయం తమదేనని స్పష్టం చేశారు.



