నవతెలంగాణ-హైదరాబాద్ : హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు, నటుడు అఖిల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జైనబ్ రవ్జీ మెడలో మూడు ముళ్లు వేశారు. జూబ్లీహిల్స్లోని నాగార్జున ఇంటిలో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు అత్యంత దగ్గరి సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.
ఇక వీరి వివాహ మహాత్సవానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్చరణ్-ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్ తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అనంతరం పెళ్లి బరాత్ నిర్వహించగా.. నాగార్జున, నాగచైతన్య తదితరులు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.