Saturday, June 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిజనాగ్రహం

జనాగ్రహం

- Advertisement -

భూమి, నీరు, గాలి… ఈ మూడూ మానవాళికి జీవనాధారాలు. వాటిని కాపాడటం, ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల విధి. కానీ ఇప్పుడు దన్వాడలో వాటి మీదే దాడి జరుగుతోంది. ‘ఇథనాల్‌ ఫ్యాక్టరీ’ పేరుతో స్థానిక ప్రజల జీవనంపై యుద్ధం సాగుతోంది. ఏలినవారి ధోరణి చూస్తే, ఇది ప్రజల సంక్షేమాన్ని కోరే పాలనేనా అనే అనుమానం రేకిత్తిస్తోంది. ప్రజలతో చర్చించకుండా, వారికి కనీస సమాచారం ఇవ్వకుండా, కాలుష్యనియంత్రణ చట్టాలను తోసిపుచ్చి, అనుమతికి మించిన భూసేకరణతో సహ ఇతర ప్రక్రియలన్నింటినీ జరిపిన తీరు.. పారదర్శకతకు గాయం చేస్తోంది. నిరసిస్తున్న ప్రజలకు ఎదురవుతున్న నిర్బంధాలు ప్రజాస్వామ్యానికే సవాలు విసురుతున్నాయి. నేడు దన్వాడలో జరుగుతున్నది కేవలం ఒక కర్మాగార నిర్మాణం మాత్రమే కాదు. అది భూమి, నీరు, గాలితో పాటు అక్కడి జీవావరణాన్నే నాశనం చేసే ఓ విధ్వంస యాత్ర. అందుకే ఆ పల్లెల్లో రైతుల గుండెలు మండుతున్నాయి. నిరసన జెండాలై ఎగురుతున్నాయి.
పది నెలల కిందట ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. దీక్షలు చేపట్టారు. అధికారులు, నాయకులు ప్రాజెక్టును నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. నమ్మిన ప్రజలు దీక్షలు విరమించారు. ఇప్పుడా నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజలు ప్రాజెక్టు ప్రాంతంలోకి చొచ్చుకుపోయి, తమ వ్యతిరేకతను ఘాటుగా ప్రకటించారు. అడ్డుకున్న కంపెనీ సిబ్బందిని తరిమికొట్టారు. యంత్రాలను ధ్వంసం చేశారు. గుడారాలకు నిప్పంటించారు. ఇవి వారు కావాలని చేసిన చర్యలు కాదు. ప్రభుత్వమే వారిని ఆ స్థితికి నెట్టింది. ఇది కేవలం వారి ఆగ్రహం మాత్రమే కాదు. జీవితాలను కోల్పోతున్నామన్న ఆవేదన. తమ భవిష్యత్తు మీద జరుగుతున్న దాడికి ప్రతిఘటన.
దీనికి ప్రభుత్వం ఎలా స్పందించాలి? ప్రజల అసమ్మతిని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి. కానీ అందుకు భిన్నంగా అణచివేతకు పూనుకున్నది. లాఠీలు ఝులిపించింది. కేసులు పెట్టింది. అరెస్టులు చేస్తోంది. ఇది బాధ్యతగల ప్రభుత్వం చేయవలసిన పనేనా? ఏలినవారు పదేపదే చెప్పుకుంటున్నట్టుగా ఇది నిజంగా ప్రజా ప్రభుత్వమే అయితే చేపట్టాల్సింది అణచివేతేనా? ముందు బాధిత ప్రజలను పరామర్శించాలి. పంచాయతీలను విశ్వసనీయంగా సంప్రదించాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి. వారి ఆందోళనలకు కారణమేంటో తెలుసుకోవాలి. కానీ ప్రభుత్వం నుంచి ఆ ప్రయత్నమేదీ లేనప్పుడు ప్రజలు మాత్రం ఏం చేస్తారు? తమ జీవించే హక్కుకే ప్రమాద ఘంటికలు మోగుతుంటే చూస్తూ ఊరుకోరు కదా? అందుకే ప్రతిఘటిస్తున్నారు. వారికి ఎటు చూసినా ఈ ప్రాజెక్ట్‌ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో కనిపించకపోగా.. దీని వెనుక తమ జీవనాధారాలను నేలమట్టం చేసే కుతంత్రమే కనిపిస్తోంది. ప్రకతిపై దాడి, తమ భవిష్యత్తుపై జరిగే యుద్ధమే కనిపిస్తోంది. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు. ఇథనాల్‌ ఉత్పత్తికి క్యూబిక్‌ మీటర్ల కొద్దీ నీరు అవసరం. ఇది స్థానిక సాగునీటి అవసరాలను పూర్తిగా తారుమారు చేస్తుంది. పైగా, ఈ పరిశ్రమ వల్ల గాలి కాలుష్యమవుతుంది. నీరు విషతుల్యమవుతుంది. నేల సారం కోల్పోతుంది. జీవనది తుంగభద్ర మురికి కూపంగా మారుతుంది. చివరికి పంటలు, పశుపోషణ, మానవ మనుగడే కాదు… అక్కడ జీవావరణమే ప్రశ్నార్థకమవుతుంది. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియని విషయాలేం కావు. తెలిసీ ఇందుకు పూనుకోవడమే ప్రజల ఆందోళనకు, ఆగ్రహానికీ కారణమవుతోంది.
ఈ నేపథ్యంలో ఏలినవారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఎన్నుకున్న ప్రజలకంటే పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే ముఖ్యమా? లేదంటే ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఈ ప్రాజెక్టు కోసం ప్రజల జీవితాలనే పణంగా పెడుతున్నారు? ప్రజల అసమ్మతిపై ఎందుకు అణచివేతకు పూనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్‌ వల్ల ప్రయోజనం పొందేది ఎవరు? కేవలం కొద్దిమంది లాభాల కోసం అసంఖ్యాకులైన ప్రజల జీవితాలను బలితీసుకోవడం న్యాయమేనా? ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకుంటారా? లేక అణచివేతద్వారానే ముందుకెళ్లాలను కుంటున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రజాస్వామ్యయుతమైన చర్చకు కేంద్రంగా నిలవాలి. ప్రభుత్వం నిజంగా పారదర్శకత, బాధ్యత కలిగిన పాలనను అనుసరిస్తే, వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఎటువంటి పారిశ్రామిక ప్రాజెక్ట్‌ అయినా ప్రజల అవసరాలను, వారి భద్రతను, పర్యావరణ సమతుల్యతను గౌరవించినపుడే అది నిజమైన అభివద్ధిగా నిలుస్తుందని గుర్తించాలి. లేదంటే ఈ ప్రశ్నలు ఉద్యమాలుగా మారుతాయి. మౌనం పెరిగేకొద్దీ అసమ్మతి తీవ్రరూపం దాల్చుతుంది. దన్వాడ ప్రజలది కేవలం ఓ ఫ్యాక్టరీకి వ్యతిరేకమైన పోరాటం కాదు. భూమి, నీరు, గాలి, జీవావరణ పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటం. భావితరాల భవిష్యత్తును నినదిస్తున్న పోరాటం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -