Wednesday, June 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసైన్స్‌ అంశాల అవగాహనతో నాణ్యమైన పోషకాహారం !

సైన్స్‌ అంశాల అవగాహనతో నాణ్యమైన పోషకాహారం !

- Advertisement -

సురక్షిత ఆహారానికి కేంద్ర బిందువు వైజ్ఞానికశాస్త్రమే. సైన్స్‌ ద్వారానే కలుషిత ఆహారాన్ని గుర్తించడంతో పాటు దానికి సంబంధించిన వ్యాధులను నివారించడం జరుగుతోంది. ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవులు, విష రసాయనాలతో కలుషితమైన ఆహారం తినడం వల్ల ప్రతి ఏట 600 మిలియన్ల ప్రజలు దాదాపు 200 రకాల రోగాల బారిన పడుతున్నారు. సురక్షిత ఆహారం ప్రాణాలను కాపాడుతుంది, జబ్బులను నివారిస్తుంది. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో తీవ్ర ఆహార కొరత వేధిస్తున్న వేళ, కలుషిత ఆహారం ఆ పేదల పాలిట శాపంగా మారుతున్నది. సురక్షిత ఆహారం అందించడం వల్ల ప్రతి ఏట 4.2 లక్షల మందిని, అందులో 40 శాతం వరకు పిల్లల నిండు ప్రాణాలను కాపాడవచ్చుని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
సురక్షిత ఆహారానికి వైజ్ఞానికమే పునాది
సురక్షిత, కాలుష్య రహిత ఆహార పదార్థాల ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐరాస – ప్రపంచ ఆరోగ్య సంస్థ – ఆహార వ్యవసాయ సంస్థలు సంయుక్తంగా ప్రతి ఏటా జూన్‌ 7న ”ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం (వరల్డ్‌ ఫుడ్‌ సేఫ్టీ డే)” నిర్వ హించుకోవటం ఆనవాయితీగా మారింది. 2025 ప్రపంచ సురక్షిత ఆహార దినం ఇతివత్తంగా ”సురక్షిత ఆహారం – సైన్స్‌తోనే భద్రత (ఫుడ్‌ సేఫ్టీ – సైన్స్‌ ఇన్‌ ఆక్షన్‌)” అనే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. కలుషిత ఆహార సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన, అసురక్షిత ఆహారం ద్వారా అనారోగ్యాలు, ఆహార భద్రత పట్ల పలు సంస్థల ఏకీకరణ, కలుషిత ఆహార మూలాలను తెలుసుకొని నిరోధించడం, సురక్షిత ఆహారానికి మార్గాలను వివరించడం లాంటి కార్యక్రమాలను ఈ వేదికగా వివరిస్తారు. ఆహార పదార్థాలు కలుషితం కావడానికి మూలాలుగా వ్యవసాయ క్షేత్రాలు, మార్కెటింగ్‌ మార్గాలు, పర్యా టకం, ఆహార రవాణా, నిల్వ చేయడం, పంపిణీ, వంట పద్దతులు, శుభ్రత పాటించకపోవడం, అపరిశుభ్ర నీటి వినియోగం, తినే సమయాల్లో చేతులను శుభ్రం చేసుకోకపోవడం లాంటి ప్రధాన అంశాలు గుర్తించబడ్డాయి.
కలుషితమైనది అసలు ఆహారమే కాదు
అసురక్షితమైనది ఆహారమే కాదని, అది విషంతో సమానమని తెలుసు కోవాలి. అసురక్షిత ఆహారం రోగాలను, పేదరికాన్ని పెంచి పోషిస్తున్నది. ముఖ్యంగా యుద్ధాలు, సంక్షోభ ప్రదేశాల్లో అన్ని వయస్సుల అభాగ్యులు/ వలసదారు లు అసురక్షిత ఆహార విషవలయంలో చిక్కి విలవిల్లాడు తున్నారు. ఈ గంభీరమైన సమస్యలను అధిగమించ డానికి ప్రభుత్వాలు, ఆహా రాన్ని పండించే రైతులు, వ్యాపారులు, విద్యావంతులు, విద్యాలయ యువత, వినియోగదారులు, పంపిణీ దారులు ఏకమై పోషకాహార నాణ్యతను కాపాడడా నికి తగు చర్యలు తీసుకోవాలి. సురక్షిత, పోషక, చవకైన ఆహారాన్ని పొందడం ప్రతి పౌరుని కనీస మానవ హక్కు అని గుర్తుంచుకోవాలి. సురక్షిత నాణ్యమైన పోషకాహారానికి మూల సూత్రాలుగా శుభ్రత, సరిగ్గా వండడం, సురక్షిత నీటి వినియోగం, ఆహార పదార్థాల శుద్ధి, సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచడం లాంటివి పేర్కొనబడ్డాయి.
వైజ్ఞానికశాస్త్రంలోని మైక్రోబయాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, వాతావరణ వైజ్ఞానిక శాస్త్రం, సామాజిక వైజ్ఞానిక శాస్త్రం, సామాజిక శాస్త్రాల సమన్వయంతో ఆహార నాణ్యత, పోషక విలువలను కాపాడడానికి కషి జరగాలి. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో సురక్షిత ఆహారానికి తగు ప్రాధాన్యం ఇవ్వడం, చిన్న చిన్న చర్యలతో పెద్ద పెద్ద రోగాలకు అడ్డుకట్ట వేయడం జరగాలి. మన ఆరోగ్యం, మనం తీసుకునే ఆహార నాణ్యత పైననే ప్రధానంగా ఆధార పడి ఉంటుందని తెలుసుకోవాలి. ఎంత తింటున్నామన్నది ముఖ్యం కాదని, ఏం తింటున్నామన్నదే ప్రధానమని తెలుసు కుందాం. తినే రెండు ముద్దలు సుచిగా, రుచిగా, శుభ్రంగా, సురక్షితంగా ఉండే విధంగా జాగ్రత్త పడదాం. ఆహారాన్ని విషతుల్యం చేయకుండా వివిధ దశల్లో తగిన చర్యలు తీసుకుందాం. ”మన సురక్షిత ఆహారమే మన సంపూర్ణ ఆరోగ్యం” అంటూ నినదిద్దాం.
(07 జూన్‌ ”ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం” సందర్భంగా)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -