– 45 సార్లు వెళ్లినా ఒక్కపైసా రాలే..
– 18 నెలల నుంచి ఢిల్లీకి సీఎం చక్కర్లు…
– మూసీ సుందరీకరణ, జల్జీవన్ మిషన్, పౌర సరఫరాల శాఖ పెండింగ్ నిధులు, వరద సాయంపై కేంద్రం మీనమేషాలు
‘మా మొర ఆలకించండి మహాప్రభో.. ఆర్థికంగా సాయం చేసి ఆదుకోండి సారో…’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా వేడుకున్నా కేంద్రంలోని మోడీ సర్కారు చెవికెక్కటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ 45 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు. హస్తినకు వెళ్లిన ప్రతీసారీ ప్రధాని మోడీనీ, హోం మంత్రి అమిత్షాను, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలుస్తున్నారు. వారికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు. పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. కానీ అక్కడి నుంచి చిల్లిగవ్వ కూడా రాష్ట్రానికి రాలేదు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో భాగంగా తమ పార్టీ అధిష్టానం వద్దకు సీఎం వెళుతున్నా.. అలా వెళ్లిన ప్రతీసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలను సైతం కలిసొస్తున్నారు. కానీ కేంద్రం వైపు నుంచి ఏదీ కలిసి రావటంలేదు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణికి కోల్ బ్లాకులు కేటాయించేందుకు రూ.1.63 లక్షల కోట్లు కావాలంటూ సీఎం రేవంత్ గతేడాది డిసెంబరులో కేంద్రాన్ని కోరారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు మరికొందరు అమాత్యులతో భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి ‘మూసీ సుందరీకరణ ప్రాజెక్టు’ కోసం రూ.10 వేల కోట్ల మేర సాయం చేయాలంటూ ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా ఈ సాయం చేయాలంటూ ఆయన కోరారు. గతేడాది రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు సంభవించి, పంటలకు అపార నష్టం వాటిల్లిన నేపథ్యంలో… రైతులను ఆదుకునేందుకు వీలుగా రూ.11,713 కోట్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ కోసం రూ.17,212 కోట్లతో డీపీఆర్ను రూపొందించామని సీఎం… ప్రధాని మోడీకి తెలిపారు. దాన్ని త్వరితగతిన ఆమోదించటంతోపాటు వీలైనన్ని ఎక్కువ నిధులివ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇవేగాకుండా పౌర సరఫరాలశాఖకు సంబంధించిన పెండింగ్ నిధులను కూడా (ఏపీతో ముడిపడి ఉన్న అంశం) వెంటనే విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి కోరారు. వీటిపై ఇప్పటి వరకూ కేంద్రం స్పందించకపోవటం గమనార్హం. వీటితోపాటు అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పరిపాలనా పరమైన అనుమతులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, జూపల్లి, కోమటిరెడ్డి, శ్రీధర్బాబు తదితరులు ప్రధాని మోడీని, సంబంధిత శాఖల మంత్రులను కలిశారు. ఆర్ఆర్ఆర్కు అనుమతులు, హైదరాబాద్లో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణ, క్రీడా సంస్థల అప్గ్రేడేషన్కు అనుమతులు, తెలంగాణ-ఏపీ మధ్య ఐకానిక్ బ్రిడ్జ్ (సోమశిల- సంగమేశ్వర మధ్య) నిర్మాణ పనులకు అనుమతి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి సాయం, రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపు, పునర్ విభజన సమస్యలకు పరిష్కారం, గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు తదితరాంశాలు వీటిలో కీలకంగా ఉన్నాయి. ఇవన్నీ గత 18 నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలే. వీటిపై ఇప్పటికీ కాలయాపన కొనసాగుతోంది తప్ప అడుగు ముం దుకు పడటం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వాపోతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇబ్బడిముబ్బడిగా నిధులు, అనుమతులిస్తున్న మోడీ సర్కార్… ఇతర రాష్ట్రాలపై తీవ్రమైన వివక్ష కొనసాగిస్తోంది. అందులో భాగంగానే తెలం గాణకు నిధులు, సాయాలు, గ్రాంట్లు, అనుమతుల విషయంలో తాత్సారం చేస్తోంది. ఇప్పటిదాకా వినతులు, విజ్ఞప్తులతో సరిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం… ఇక నుంచి కేంద్రంతో కొట్లాడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
మొర ఆలకించని మోడీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES