- – డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు మంత్రులు
– శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు
– జన సందోహమైన ప్రజాభవన్
– భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు
– ఉస్మానియా విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్
నవతెలంగాణ – హైదరాబాద్: ఆదివారం నాడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజాభవన్ చేరుకుని ఉప ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు భారీగా ప్రజాభవన్ కు చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రజాభవన్ చేరుకుని ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సినీనటుడు మురళీ మోహన్ సైతం ప్రజాభవన్ చేరుకుని ఉప ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. - రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు కేక్ కటింగ్ లు చేయడం, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంచిపెట్టడం, రక్తదానాలు చేయడం జరిగింది. ఆదివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాల నుంచి వచ్చిన వేద పండితులు, అర్చకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు అందించారు. ప్రజాభవన్ లో వెలిసిన అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో, ఆరోగ్య, ఐశ్వర్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు లోకేష్ యాదవ్ తదితరులు ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి చిత్రపటంతో రూపొందించిన భారీ కేక్ ను భట్టి విక్రమార్కతో కట్ చేయించారు. అనంతరం అక్కడనుంచి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసేందుకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ పాఠశాలకు వెళ్లారు. అక్కడే విద్యార్థులతో కలిసి ఉప ముఖ్యమంత్రి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు మాష్కీ గౌడ్, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన సందర్భంగా ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గంలోని అన్ని ఆలయాల్లో అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు పెత్త ఎత్తున నిర్వహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహరహరం శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఆయు, ఆరోగ్యాలతో జీవించాలని కార్యకర్తలు భగవంతుడిని ప్రార్థించడం విశేషం.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక, విద్యుత్ శాఖలను సర్వసమర్థవంతంగా నిర్వహిస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంమేకాక, సామాజిక తెలంగాణ కోసం ఉప ముఖ్యంత్రి పాటుపడుతున్నారని వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాలు, సబ్బండ వర్గాల పురోగతి కోసం అనునిత్యం ముఖ్యమంత్రి గారితో చర్చిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని అన్నారు.
