Friday, June 20, 2025
E-PAPER
Homeజిల్లాలుఅంగన్వాడీలో పాములు, ముంగిసలు..

అంగన్వాడీలో పాములు, ముంగిసలు..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలం పరిధిలోని ఖరగ్ అంగన్వాడిలోకి పాములు, ముంగిసలు వస్తున్నాయని ఆందోళనతో టీచర్ తెలిపింది. విషయం తెలుసుకున్న నవతెలంగాణ విలేఖరి అంగన్ వాడీ కేంద్రానికి వెళ్ళి ఆరా తీశారు. ఈ క్రమంలో టీచర్ మాట్లాడుతూ.. అంగన్వాడీలోకి రావడానికి నాకే భయంభయంగా ఉంది. ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చెప్పండని వాపోయింది. ఈ గ్రామంలో అంగన్వాడికి సొంత బిల్డింగ్ లేదని, పాఠశాల పాత బిల్డింగులో కొనసాగుతుందని అన్నారు. ఈ బిల్డింగు పురాతనమైనందున దర్వాజాలు, కిటికీలు పాడైపోయాయని తెలిపారు. దీనికి తోడు చుట్టుపక్కల అటవీ ప్రాంతంగా ఉండటం వల్లకూడా పాములు, ముంగిసలు వస్తుండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంగన్వాడీలో చిన్నారులకోసం నిల్వ ఉంచిన కోడిగుడ్లకోసం ఈ పాము, ముంగిసలు వస్తున్నాయని టీచర్ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భవనంలో ప్లిలలకు చదువు, పౌష్టికాహారం, ఎలా అందించాలని ఆవేదన చెందుతోంది. అంతేగాక ఇక్కడికి గర్చీనీలు, బాలింతలు కూడా వస్తూ వెళ్తూ ఉంటారని, వీరందరికి ఎలా భద్రత కల్పించాలని ప్రశ్నిస్తోంది. అంగన్వాడీ కేంద్రం విధులు పూర్తయ్యాక తాళం వేసి ఇంటికి వెళ్ళాకా.. పాడైపోయిన కిటికీల్లోంచి పాములు, ముంగిసలు ఆవాసాలుగా మార్చుకుని, ఇందులోనే ఉదయం వరకు ఉంటున్నట్లు అనుమానపడుతోంది. ఒకరోజు ఉదయం గదిలోకి పాములు రావడాన్ని చిన్నారులు చూసి భయంతో బయటికి పరుగులు తీశారని తెలిపింది. ఈ విషయమై గ్రామంలోని పెద్దలు, నాయకులు కూడా తీవ్రంగా మండిపడ్డారు. గుడ్ల రక్షణ కోసం అంగన్వాడీ పిల్లలకు బరువు తూకం చేసే కొండికి ఒక బకెట్లో క్రోడిగుడ్లను నిలువ ఉంచవలసి వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మాధవరావు పాటిల్ ఈ విషయం గురించి ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కొత్త భవనం నిర్మించడానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కూడా ఆయన వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -